కరీంనగర్ ముకరంపుర, ఆగస్టు 5: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అన్ని విధాల అండగా నిలుస్తున్నదని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణలో భూమికి బరువయ్యేంతా పంట పండిందని, రైతులు పండించిన పంటను కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో శుక్రవారం నిర్వహించిన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధుతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్ చైర్మన్, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్ ఛైర్మన్ ఉప్పు రాజశేఖర్, డైరెక్టర్లు కర్నాటి చలమయ్య, పబ్బతి రంగారెడ్డి, గుంటి రాజమల్లు, సోమిరెడ్డి లక్ష్మారెడ్డి, గోలి మల్లయ్య, గంగాధర లస్మయ్య, గుండేటి అనిత, చంద్రపల్కల అంజయ్య, మహమ్మద్ మహముద్పాషా, విజయ్కుమార్ ముందడా, శివనాథుని వెంకటేశ్వర్లుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్యాలయంలో చైర్మన్గా మధు బాధ్యతలు చేపట్టగా వెంకటేశ్వరస్వామి డైరీ, ప్రసాదాన్ని మంత్రి గంగుల కమలాకర్ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. రైతులకు మార్కెట్ కమిటీ అండగా ఉంటుందని, గ్రామాల్లో రైతులు ఎక్కడ ఇబ్బంది పడ్డా పాలకవర్గం తమ సమస్యగా భావించి పరిష్కరించాలన్నారు.
కాళేశ్వరం నీటితో కరీంనగర్ నియోజకవర్గంలో అద్భుతంగా పంటలు పండుతున్నాయన్నారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలుకు ఐకేపీ సెంటర్లను తీసుకువచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు వారి రాష్ర్టాల్లో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులను దించే ప్రయత్నాలు చేస్తుంటే…తెలంగాణలో సుస్థిర పాలన, లా అండ్ ఆర్డర్లో శభాష్ అనేలా పాలన అందించే కేసీఆర్ ప్రభుత్వాన్ని 60శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ‘ఒకరు నడుస్తున్నరు.. ఎందుకు నడుస్తున్నరో ఆ భగవంతుడికే తెలియాలి. మరొకరు యుద్ధం చేస్తం అంటరు’.
వీరంతా తెలంగాణ పచ్చగా ఉంటే చూడలేక విషం గక్కుతున్నారని మండిపడ్డారు. సోనియా ఢిల్లీలో మీట నొక్కితే ఇక్కడ అదేవిధంగా అనుసరిస్తారని, బీజేపీలో అమిత్షా ఏం చేబితే అదే ఇక్కడ చేస్తరని ఎద్దేవా చేశారు. అదే తెలంగాణాలో ప్రజలు ఏం చెబితే కేసీఆర్ అదే చేస్తారని చెప్పారు. ఎనిమిదేళ్లుగా మనల్ని మనం పాలించుకుంటే వారికి ఎందుకంత కళ్ల మంట..? ఎందుకు ఈ కడుపు మంట? అని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని కుక్కలు చింపిన విస్త్తరిలా చేసేందుకు సీమాంధ్ర నాయకులు వస్తున్నరని, మన పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడుకోవాలని కోరారు. కేసీఆర్ బతికిఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నానంటే అది మీ అందరి ఆశీర్వాదమేనన్నారు. వేలాది కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి రోడ్లతో పాటు సాగు, తాగునీరు, ఇతర అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిదుతున్నట్లు తెలిపారు. ఇప్పుడిప్పుడే నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయని, పదవి వస్తే ఉంటా.. లేకుంటే పోతా అనే వాళ్లు కాకుండా జెండా పట్టుకున్నోళ్లే మన వాళ్లన్నారు. 90శాతం ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నారన్నారు. త్వరలోనే జనంలోకి వచ్చి సమస్యలు పరిష్కరించుకుందామన్నా రు. అంతకుముందు ఆసిఫ్నగర్ నుంచి కరీంనగర్ మార్కెట్ కమిటీ వరకు బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో మేయర్ సునీల్రావు, మున్సిపల్ ఛైర్మన్ రాజు, మార్కెటింగ్ అధికారి పద్మావతి, కార్యదర్శి పురుషోత్తం, ఎంపీపీలు లక్ష్మయ్య, శ్రీలత, సహకార సంఘం అధ్యక్షులు శ్యాంసుందర్రెడ్డి, ఆనందరావు, రవి, హరిశంకర్, చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకుడు సాబిర్పాషా, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, రైతు బంధు సమితి కన్వీనర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.