Child Protection | పెద్దపల్లి, సెప్టెంబర్ 19 : పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణతో పాటు వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పెద్దపల్లి జిల్లాప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మిషన్ బాల సురక్ష–శిక్షా, న్యాయ 2026లో భాగంగా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా నామినేట్ చేసిన ఉపాధ్యాయులకు పిల్లల హక్కులపై వన్ డే సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణతో పాటు వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, విద్యాశాఖ సంయుక్తంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు.
పిల్లలకు చదువుతో పాటు మంచి నడవడిక, రక్షణ, భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించడం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల బాధ్యత అని తెలిపారు. బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో చట్టం, చట్టపరమైన రక్షణలు, న్యాయపరమైన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన భద్రతా సూత్రాలను నేర్పించాలని తెలిపారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు బోధించడానికే పరిమితం కాకుండా విద్యార్థుల మానసిక స్థితిని కూడా గమనించాలని సూచించారు. అనంతరం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి (పోక్సో) కే స్వప్న రాణి, డీసీపీ రాంరెడ్డి , పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మేకల మల్లేశం యాదవ్, ఇన్ చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి హన్మంతు, గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కవిత, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జితేందర్, లీగల్ కం ప్రొవిషన్ ఆఫీసర్ రజిత, న్యాయ, పోలీస్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.