ధర్మపురి, సెప్టెంబర్ 10: సమాజానికి దిక్సూచి, మార్గ నిర్దేశకులు టీచర్లు అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ధర్మపురి పట్టణంలోని ఎస్హెచ్ గార్డెన్స్లో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 535 మంది ప్రైవేటు టీచర్లకు హెల్త్కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ బాటలో విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ఏదైనా.. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానాన్ని పెంపొందించాలని సూచించారు.
లక్ష్యంపై స్పష్టమైన అవగాహనను కలిగించి, కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. అయితే ప్రైవేట్ టీచర్లకు అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు దవాఖాన ఖర్చుల కోసం ఇబ్బందులు పడకుండా ఎల్ఎమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్కార్డులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల కోసం టేబుల్ టెన్సీస్ క్రీడాకారిణి, బాల మేధావి, మోటివేటర్ నైనా జైస్వాల్, మేధ ఇనిస్టిట్యూట్ చిరంజీవితో వెల్గటూర్ మండలంలో నిర్వహించిన అవగాహన సదస్సు మంచి ఫలితాలనిచ్చిందన్నారు. హైస్కూల్ విద్యార్థులు అడుగకపోయినా కొప్పుల ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిళ్లను కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వేల స్పోకెన్ ఇంగ్లిష్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేశామన్నారు. మేధ చిరంజీవి స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ కోసం నిరుద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ఆరు వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.
535 మందికి హెల్త్ కార్డులు
నియోజకవర్గంలోని ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్న 535 మంది టీచర్లను మంత్రి ఈశ్వర్ సన్మానించి, హెల్త్ కార్డులను అందజేశారు. శ్రీతులసీ హెల్త్ కేర్ సర్వీసెస్ ద్వారా ఒక్కో కార్డుకు 2వేల చొప్పున మొత్తం 535 కార్డులకు ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 10.70లక్షలు వెచ్చించి కార్డులను ఇచ్చారు. అనారోగ్యానికి గురైతే ఉమ్మడి జిల్లాల్లో సూచించిన 54 దవాఖానల్లో 40శాతం డిస్కౌంట్తో చికిత్స పొందవచ్చని, రూ.లక్ష ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించినట్లు మంత్రి తెలిపారు. హెల్త్కార్డుతో పాటు ట్రాన్స్పోర్టు, పేషంట్ ఫుడ్, కిట్, లిక్విడ్ను అందజేస్తారని చెప్పారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, జిల్లా అధ్యక్షుడు రామారావ్, ట్రస్మా నాయకులు రవిప్రసాద్, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, ట్రస్మా నాయకులు సిరిపురం సత్యనారాయణ, చిలివేరి శ్యాంసుందర్, ఎర్రంశెట్టి మునీందర్ ఉన్నారు.