పత్తి కొనుగోళ్లకు తాత్కాలిక బ్రేక్ పడింది. జిన్నింగ్ మిల్లుల్లో నిల్వ చేసేందుకు స్థలం లేదనే సాకుతో సీసీఐ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నది. గురువారం నుంచి ఫిబ్రవరి 4 దాకా కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం, మార్కెటింగ్ అధికారులకు సమాచారం ఇవ్వడంపై రైతుల్లో అనేక అనుమానాలను లేవనెత్తింది. ఈ క్రమంలో డీడీఎం పద్మావతి బుధవారం జిల్లాలోని పలు జిన్నింగ్ మిల్లులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, విషయాన్ని కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే కొనుగోళ్ల నుంచి తప్పించుకునేందుకే సీసీఐ అధికారులు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తుండగా, మరోవైపు ఈనెల 5వ తేదీ నుంచి కొనుగోళ్లు జరుగుతాయని అధికారులు భరోసా ఇస్తున్నారు.
కరీంనగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : అక్టోబర్ ఒకటి నుంచి కరీంనగర్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. కొనుగోళ్ల కోసం కరీంనగర్ మార్కెట్ యార్డ్ పరిధిలో 3, జమ్మికుంట మార్కెట్ యార్డ్ పరిధిలో 7, చొప్పదండి మార్కెట్ యార్డ్ పరిధిలో 1, గోపాల్రావుపేట యార్డ్ పరిధిలో మరొకటి చొప్పున జిల్లాలో మొత్తం 12 మిల్లులను నోటిఫై చేశారు. సీసీఐ, ప్రైవేట్ వ్యాపారుల ద్వారా ఇప్పటి వరకు 2,24,965 క్వింటాళ్ల పత్తిని కొన్నారు. ఇంకా ఫిబ్రవరి నెలాఖరు వరకు పత్తి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నది. కానీ, సీసీఐ అధికారులు మాత్రం నోటిఫైడ్ మిల్లుల్లో రా పత్తి నిల్వ చేసుకునేందుకు స్థలం లేదని, ఉన్న పత్తిని బేల్లు కట్టే దాకా కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో సీసీఐ అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కొనుగోళ్లను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించే ప్రయత్నంలోనే సీసీఐ తప్పుకుంటున్నదని ఆరోపిస్తున్నారు. పొడువు రకం గింజ పత్తి క్వింటాలుకు 7,020, మధ్య రకం గింజ పత్తి క్వింటాలుకు 6,620గా కనీస మద్దతు ధర కేంద్రం నిర్ణయించిందని, సీసీఐ నిబంధనలతో ఈ మద్దతు ధర ఏ రైతు పండించిన పత్తికి రావడం లేదని వాపోయారు. సీసీఐ రంగంలో ఉంటేనే ప్రైవేట్ వ్యాపారులు కనీస ధర చెల్లించైనా పత్తి కొనుగోలు చేస్తారని, లేకుంటే సిండికేట్గా ఏర్పడి అడ్డగోలుగా తగ్గించి కొంటారని ఆందోళన చెందుతున్నారు. జమ్మికుంట లాంటి ప్రాంతంలో ఇప్పటి వరకు సీసీఐ కంటే ప్రైవేట్ వ్యాపారులే ఎక్కువ పత్తిని కొనుగోలు చేశారని, అది సీసీఐ ఉండడంతోనే చెప్పారు. ఇప్పుడు చేతులెత్తేస్తే పండించిన పత్తిని తెగనమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జిన్నింగ్ మిల్లులో నిల్వ చేసుకునే స్థలం లేదనేది సాకేనని, తిరిగి తెరుస్తుందన్న నమ్మకం లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని జిన్నింగ్ మిల్లుల్లో కలిపి రోజుకు 10 నుంచి 12 వేల క్వింటాళ్ల పత్తి మాత్రమే మార్కెటింగ్ అవుతున్నదని, ఈ మాత్రం పత్తిని నిల్వ చేసే సామర్థ్యం మిల్లులకు లేదని చెప్పడం సరికాదంటున్నారు. అంతే కాకుండా బేల్లు ఇవ్వడంలో కూడా జిన్నింగ్ మిల్లులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా చివరి దశలో మిల్లుల్లో స్థలం లేకుండా పోయిందని, ఇది అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. పత్తి దిగుబడులు వచ్చే వరకు కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జిన్నింగ్ మిల్లులో స్థలభావం కారణంగా పత్తి కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపి వేస్తామని సీసీఐ అధికారులు చెప్పగానే, వాస్తవ పరిస్థితులు అంచనా వేసేందుకు కరీంనగర్ డీడీఎం పద్మావతి బుధవారం పలు మిల్లులను తనిఖీ చేశారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ఎలబోతారం శక్తి మురుగన్ జిన్నింగ్ మిల్లుతోపాటు చొప్పదండి మార్కెట్ పరిధిలోని రుక్మాపూర్ శివ శివాణి మిల్లులో ఆమె తనిఖీ చేశారు. శక్తి మురుగన్ జిన్నింగ్ మిల్లులో కొంత స్థలం ఉందని, శివ శివాణి మిల్లు మాత్రం పూర్తిగా నిండి పోయిందని ఆమె గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఉన్న పత్తిని వెంట వెంటనే బేల్లు కట్టి సీసీఐకి ఇచ్చినట్లయితే కొత్తగా వచ్చే రా పత్తిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆమె మిల్లర్లకు సూచించారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామని కూడా ఆమె వెల్లడించారు. కాగా ఈ పరిస్థితిని కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి కూడా మార్కెటింగ్ అధికారులు తీసుకెళ్లారు.
సీసీఐ పత్తి కొనుగోళ్లను తాత్కాలికంగానే నిలిపి వేస్తున్నది. రైతులు ఆందోళన అవసరం లేదు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో 2.24 లక్షల క్వింటాళ్లకుపైగా పత్తిని కొనుగోలు చేశాం. ఇంకా ఎంత వచ్చినా కొనేందుకు సీసీఐ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మిల్లుల్లో స్థల భావం కారణంగానే గురువారం నుంచి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపి వేస్తున్నారు. తిరిగి ఐదో తేదీ నుంచి కొనుగోళ్లు చేయించే బాధ్యత మాది. రైతులు భరోసాగా ఉండాలి. సీసీఐ కేంద్రాలకు మంచి నాణ్యమైన పత్తిని తీసుకెళ్లాలి. అలాంటప్పుడే ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర వస్తుంది.
– పద్మావతి, డీడీఎం కరీంనగర్