కార్పొరేషన్, నవంబర్ 17: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కరీంనగర్ నియోజకవర్గం పరిధిలో మహిళలు, వృద్ధులు, రైతులు, యువత పెద్ద ఎత్తున సభకు రావడంతో బీఆర్ఎస్లో జోష్ నింపింది. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన సభ సీఎం కేసీఆర్ రాకముందే జనంతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలతో పాటు నియోజకవర్గం చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు రావడంతో ఎస్సారార్ కళాశాల మైదాన ప్రాంతాలు జనంతో నిండిపోయాయి. నగరంలోని 60 డివిజన్ల నుంచి మహిళలు భారీగా వచ్చారు. కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల నుంచి సభకు వచ్చే దారులన్నీ గులాబీమయం అయ్యాయి. నగరంలోని అన్ని వీధులు బీఆర్ఎస్ శ్రేణులతో సందడిగా కనిపించాయి. మధ్యాహ్నం 12 గంటలకే సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది.
స్థలం సరిపోకపోవడంతో కరీంనగర్-జగిత్యాల రోడ్డుపై భారీగా జనం బారులు తీరి నిలబడ్డారు. ఎస్ఆర్ఆర్ మైదానంలోకి వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో చాలా మంది కళాశాలకు నలుమూలల ఉన్న రోడ్లపై బండ్లు అపి.. అందులోనుంచి ముఖ్యమంత్రి స్పీచ్ విన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభం నుంచి తుది వరకు ప్రజలు ఆసక్తిగా విన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్పై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించడంతో పాటు ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఉన్నత స్థానంలో ఉంటాడని పేర్కొనడంతో సభా ప్రాంగణం మొత్తం నినాదాలు చేస్తూ మద్దతు ప్రకటించారు. కేబుల్ బ్రిడ్జి విషయంలో విపక్షాలు చేసిన తప్పుడు ప్రచారాలపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలు కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో, యువ నాయకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. పని చేసే వారిపైనే విపక్షాలు విమర్శలు చేస్తాయంటూ గంగుల పనితీరును కేసీఆర్ మెచ్చుకోవడంతో శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. సభా సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పూలు చల్లుకుని ఆనందాన్ని పంచుకున్నారు.
మెడికల్ కళాశాల, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఓటు వెయ్యవద్దని ముఖ్యమంత్రి పిలుపు నివ్వడంతో సభ చప్పట్లతో మారుమోగింది. అలాగే, తెలంగాణ ఉద్యమానికి, ప్రభుత్వానికి అండగా ఉంటున్న కరీంనగర్ గడ్డకు శిరసు వంచి నమస్కరిస్తున్నాంటూ చెప్పడంతో.. సభ జైకేసీఆర్ అంటూ నినాదాలతో మార్మోగింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన విధ్వంసం, అనాడు ప్రజలకు ఎదురైన కష్టాలు, పదేళ్లలో తెలంగాణ సాధించిన విజయాలు, బీజేపీ చేస్తున్న మతరాజకీయాలు వంటి అంశాలను ముఖ్యమంత్రి విడమరిచి చెప్పడంతో.. అందరూ ఆసక్తిగా ఉన్నారు. అలాగే, తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్వన్ స్థానంలో ఉందని, విద్యుత్ వినియోగంలోనూ దేశంలో మొదటి స్థానంలో ఉందంటూ ముఖ్యమంత్రి చెప్పడంతో.. సభలో మరోసారి నినాదాలు మిన్నంటాయి.
ఎవరు అవునన్నా.. కాదన్న బీఆర్ఎస్దే మళ్లీ విజయం అంటూ స్పష్టం చేయడంతో జై బీఆర్ఎస్ అంటూ సభలో చప్పట్లు మర్మోగాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, మేయర్ యాదగిరి సునీల్రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ జడ్పీ చైర్మన్ రాజేశం గౌడ్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అక్బర్ హుస్సేన్, ఎంపీపీలు పిల్లి శ్రీలత-మహేశ్, లక్ష్మయ్య, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
విద్యానగర్/హౌసింగ్బోర్డుకాలనీ, నవంబర్ 17: కరీంనగర్లో నిర్వహించిన నియోజకవర్గ ప్రజా ఆశీర్వద సభకు విచ్చేసిన సీఎం కేసీఆర్కు నియోజకవర్గ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శాతవాహన యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్న సీఎం కేసీఆర్కు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. వీరితో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మేయర్ యాదగిరి సునీల్రావు, రాష్ట్ర సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. యూనివర్సిటీ నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం వరకు సీఎం కాన్వాయ్తో తరలివచ్చారు. సభ అనంతరం 2.43 గంటలకు సీఎం కేసీఆర్ గంగాధర సభకు ప్రయాణం అయ్యారు.
కొత్తపల్లి, నవంబర్ 17: జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాల మైదానంలో నిర్వహించిన సీఎం ఆశీర్వాద సభకు మండలం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న ప్రజలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్కు మద్దతు పలికారు. కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్, ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు ప్రజలను సభకు తరలించారు. కరీంనగర్ రూరల్, నవంబర్ 17: కరీంనగర్ రూరల్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చారు. తీగలగుట్టపల్లి నుంచి కొమ్ము భూమయ్య, దాసరి సాగర్ ఆధ్వర్యంలో యువకులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా గులాబీ కండువాలతో తరలివచ్చారు.
-కలెక్టరేట్/ విద్యానగర్/కమాన్చౌరస్తా/ ముకరంపుర/ తెలంగాణచౌక్/కొత్తపల్లి