కరీంనగర్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న సేవా క్రెడిట్ కో ఆపరేటివ్ సోసైటీ బ్యాంకు చోరీ కేసును కరీంనగర్ టౌన్ పోలీసులు 3 గంటల్లోనే ఛేదించారు. పట్టుబడిన నిందితులను కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో సీపీ సత్యనారాయణ మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు.
సోసైటీ భవనంలో చోరీ జరిగిందని సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు బలమైన ఆధారం లభ్యమైంది. భవనంలో ఉన్న లాకర్ పగులగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తి పాత నేరస్తుడేనని గుర్తించి ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
అయితే చోరీకి పాల్పడిన నిందితుడు లాకర్ తెరుచుకోకపోవడంతో లాకర్తో సహా ఎత్తుకెళ్లాడు. స్థానికంగా దానిని తెరిస్తే అనుమానం వస్తుందని భావించి పారిపోయేందుకు ప్రయత్నించడంలో భాగంగా కరీంనగర్ బస్టాండ్కు వెళ్లగా అప్పటికే నిందితున్ని గుర్తించిన పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపులు జరిపి బస్టాండ్లో అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద నుండి లాకర్ను స్వాధీనం చేసుకుని బ్యాంకు సోసైటీ సిబ్బందిని పిలిపించి వారి సమక్షంలో తెరిచారు. అందులో రూ.14,03,960 లక్షల నగదు, 13 తులాల బంగారు అభరణాలు లభ్యమయ్యాయి. బ్యాంకు రికార్డులను పరిశీలించి చోరికి గురైంది 14 లక్షలేనని నిర్ధారించుకున్నారు. నిందితుడు కశ్మీర్ గడ్డకు చెందిన షేక్ సాధిక్ (24), అతడికి సహకరించిన ముకరంపురకు చెందిన మహ్మద్ షబాద్ (22)లను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
నిందితులకు గతంలో నేర చరిత్ర ఉండటంతో సీసీ టీవీ పుటేజీల ద్వారా నిందితులను త్వరగా గుర్తించగలిగామన్నారు. నిందితులను పట్టుకోవడం కోసం కరీంనగర్ టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. వన్టౌన్ క్రైం కానిస్టేబుల్ బషీర్ చొరవతో నిందితులను సులభంగా పట్టుకున్నామన్నారు. కానిస్టేబుల్ బషీర్కు నగదు రివార్డు అందజేస్తామని సీపీ తెలిపారు.