ఆకాశాన మిలమిలలాడే చుక్కలన్నీ ఈ కోనేట్లో మణిదీపాలుగా వెలుగొందాయా.. అన్నట్లుగా మెట్టుమెట్టుకూ ఓ దీపం.. అజ్ఞాన తిమిరాలు, కష్టాల చీకట్లను తరిమికొడుతూ అడుగుఅడుగుకూ ఓ దీపం.. ఒక్కో దీపం అలా జ్వాలా తోరణమై పంచ సహస్ర దీపాలంకరణగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నారసింహక్షేత్రాల్లో ఒక్కటైన జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని బ్రహ్మపుష్కరిణి(కోనేరు) సోమవారం రాత్రి ఇలా దేదీప్యమానంగా వెలుగొందింది.
ధర్మపురి, నవంబర్ 7 : కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మపురి క్షేత్రంలోని బ్రహ్మపుష్కరిణి(కోనేరు) సోమవారం రాత్రి సహస్ర దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలుగొందింది. ముందుగా ఆలయ వేద పండితులు బొజ్జ రమేశ్శర్మ తదితర వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ఉప ప్రధాన అర్చకులు నంబి శ్రీనివాసాచారి బ్రహ్మపుష్కరిణి మధ్య బోగమండపంలో లక్ష్మీనరసింహస్వామివారి చిత్రపటం పెట్టి పూజలు చేశారు. అనంతరం మంత్రి ఈశ్వర్ సతీమణి స్నేహలత, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఈవో శ్రీనివాస్ దీపాలంకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా, సహస్ర దీపాలంకరణతో బ్రహ్మపుష్కరిణి కాంతులీనింది.