సంప్రదాయ పద్ధతిలో కాకుండా తడిపొడి విధానంలో వరి సాగు చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొలానికి నిరంతరం నీళ్లు పెట్టడం వల్ల సారవంతమైన భూమి పై పొరలు కొట్టుకుపోవడం, పైరు వేరు వ్యవస్థ బలహీనంగా ఉండి గాలి వాటానికి నేలకు ఒరగడం, ఎరువులు వాడినపుడు నీటిలోనే ఎక్కువగా వృథాగా పోవడం వంటివే కాకుండా మిథేన్ విషవాయువులు విడుదలై వాతావరణంలో కాలుష్యం పెరుగుతున్నది. అదే తడిపొడి విధానంలో వరికి అవసరమైనప్పుడే నీటి తడులు ఇవ్వడం వల్ల అనేక లాభాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంప్రదాయ సాగుతో పోలిస్తే నీటి వినియోగం 15 నుంచి 30 శాతం తక్కువగా ఉంటుంది. అందించే ప్రతి నీటి బిందువును మొక్కలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని వేరు వ్యవస్థ బలంగా మారుతుంది. 14 నుంచి 20 శాతం దిగుబడులు అధికంగా సాధించే అవకాశముంటుంది. తడిపొడి విధానంలో పొలం ఆరబెట్టాల్సి వస్తున్న నేపథ్యంలో వరిలో అధికంగా ఆశించే దోమ పోటు సమస్య కూడా నివారించే అవకాశమున్నది.
కరీంనగర్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా పెరిగాయి. ఇన్నాళ్లు బీళ్లుగా ఉన్న భూములన్నీ సాగులోకి వచ్చాయి. వరినే ప్రధాన పంటగా రైతులు సాగు చేస్తున్నారు. అయితే అవసరం లేకున్నా అధిక మోతాదులో నీటిని వాడడం వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని పెంచే మిథేన్ పెరుగుతున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి వరి నీటి మొక్క కాదని తేల్చారు. అనేక ప్రయోగాల ద్వారా వరిని తడిపొడి (ఆరుతడి) విధానంలో సాగు చేయవచ్చని నిరూపించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో కొందరు రైతులు ఈ విధానాన్ని పాటిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఏరువాక కేంద్రం సైంటిస్టులు గతంలో ఈ విధానాన్ని రామడుగు మండలం దేశరాజ్పల్లిలో పరిచయం చేశారు. కొందరు రైతులు ఈ విధానం ద్వారా వరి సాగు చేసి అధిక దిగుబడులు సాధించారు. ఆ తర్వాత పర్యవేక్షణ లేక పోవడంతో ఈ విధానం విస్తరించ లేదు. ఒక కిలో ధాన్యం పండించేందుకు నేల రకాలను బట్టి 3వేల నుంచి 5 వేల లీటర్ల నీరు అవసరముంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఒక క్వింటాల్ ధాన్యం పండించేందుకు లక్షల లీటర్ల నీరు అవసరముంటుందో అర్థం చేసుకోవచ్చు. అధిక నీటి వినియోగవం వల్ల కొన్ని అనర్థాలు ఎదురవుతున్నాయి. వ్యవసాయానికి వాడుతున్న నీటిలో 60 శాతానికిపైగా వరికే వినియోగిస్తుండడంతో నీటి కొరత ఏర్పడి ఇతర పంటల గురించి రైతులు ఆలోచించలేక పోతున్నారు. అంతే కాకుండా విద్యుత్ వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తడిపొడి పద్ధతిలో వరి సాగు చేయడం మేలని భావించిన ప్రభుత్వం గత రెండు మూడేళ్లుగా రైతులను ఈ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది.
ప్లాస్టిక్ పైపు చిట్కా..
తడిపొడి వరి సాగు విధానంలో ప్రధానమైనది ప్లాస్టిక్ పైపు (గొట్టం) చిట్కా. రంధ్రం ఉన్న ప్లాస్టిక్ గొట్టం వినియోగించి పొలంలో ఉండే నీటి మోతాదు గురించి అంచనా వేయవచ్చు. అందుకోసం రైతులు ముందుగా ఒక అడుగు పొడవు 6 అంగుళాల వ్యాసం ఉండే ప్లాస్టిక్ గొట్టాన్ని తీసుకోవాలి. గొట్టం అడుగు భాగం నుంచి సగం ఎత్తు వరకు చుట్టూ రంధ్రాలు 0.5 సెంటీ మీటర్ల పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. రెండు రంధ్రాల మధ్య 2 సెంటీ మీటర్ల దూరం ఉండాలి. దీనిని అర అడుగు లోతు వరకు భూమిలోపలికి దించుకోవాలి. గొట్టం పొలం గట్టుకు మీటరు దూరంలో ఉండేలా చూసుకుంటే పర్యవేక్షణ సులువవుతుంది. గొట్టంలోపల మట్టిని తీసివేయాలి. ఇలా అమర్చిన గొట్టం పొలంలోని నీటి మట్టాన్ని తెలియజేస్తుంది. గొట్టం రంధ్రాల గుండా బయటికి, లోపలికి నీరు సులభంగా ప్రవహిస్తుంది. నాటు వేసిన ఒకట్రెండు వారాల్లో కలుపు నివారణ చర్యలు చేపట్టిన తర్వాతే తడిపొడి పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. కలుపు ఎక్కువగా ఉంటే మరో వారం ఆగిన తర్వాతనైనా ఈ పద్ధతిని పాటించవచ్చు. పొలంలో తడి పెట్టిన తర్వాత నీటి మట్టం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. నీటి మట్టం పొలంలో 5 సెంటీ మీటర్లు పైకి వచ్చే దాకా నీరు ఉండేలా తడి ఇవ్వాలి. అలా కాని పక్షంలో పొలంలో వెంట్రుక మందం నేల చీలిపోయినట్లుగా కనిపిస్తే నీటి తడిని అందించాల్సి ఉంటుంది. పంట పూత దశకు వచ్చిన వారం తర్వాత మాత్రమే పొలంలో 5 సెంటీ మీటర్ల వరకు నీరు నిలబడేలా చూసుకోవాలి. పూత దశ తర్వాత గింజపాలు పోసుకునే దశలో, కోతకు ముందు నీరు నిలబడేలా చూసుకోవాలి. పొలంలో 5 సెంటీమీటర్ల కంటే తక్కువ నీరు పెట్టుకున్నా ఫరవాలేదు.
ఐదు మండలాల్లో 12,500 ఎకరాలు..
వరిలో తడిపొడి విధానాన్ని అమలు చేసేందుకు కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. పద్మపాని స్వచ్ఛంద సంస్థకు ఉమ్మడి జిల్లాలో ఈ సంస్థ ప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం చొప్పదండి, గంగాధర, తిమ్మాపూర్, మానకొండూర్, సైదాపూర్ మండలాలను పైలెట్గా తీసుకున్నారు. ఒక్కో మండలంలో 2,500 ఎకరాలు టార్గెట్గా పెట్టుకున్నట్లు పద్మపాని స్వచ్ఛంద సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ స్వప్న తెలిపారు. ఈ యాసంగి సీజన్లో మొత్తం 12,500 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు ఈ ఐదు మండలాల్లో 7 వేల మంది రైతుల నుంచి అగ్రిమెంట్లు చేసుకున్నామని వివరించారు. మరో పక్క పద్మపాని ఎన్జీఓకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మంచి సహకారాన్ని అందిస్తున్నారు. రైతు వేదిక కేంద్రాల్లో రైతులకు పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వరిలో తడిపొడి సాగు విధానం ఒక ఉద్యమంలా కొనసాగించేందుకు పద్మపాని ఎన్జీవో ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం పైలట్గా తీసుకున్న ఈ ఐదు మండలాల్లో లక్ష్యం నెరవేరడంతో మిగతా మండలాలకు కూడా ఈ విధానాన్ని రైతులకు పరిచయం చేసి అమలులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. రైతులు పొలాల్లో అమర్చుకునే పైపుతోపాటు రైతులను ప్రోత్సహించేందుకు ప్రస్తుతం ప్రతి ఎకరాకు 800 ప్రోత్సాహకంగా అందించనున్నారు. అగ్రిమెంట్ చేసుకున్న రైతుల నుంచి పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం సేకరిస్తున్నారు.
రైతులు బాగా స్పందిస్తున్నారు
తడిపొడి విధానంలో వరి సాగు చేసేందుకు చాలా మంది రైతులు ముందుకు వస్తున్నారు. నాకు ఇచ్చిన తిమ్మాపూర్ మండలంలో ప్రతి గ్రామాన్నీ తిరిగి వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నా. ఇప్పటికే చాలా మంది రైతులు అగ్రిమెంట్ చేసుకున్నారు. ముఖ్యంగా యాసంగిలో నీటి ఎద్దడి ఏర్పడే గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి తడిపొడి విధానంలో వరి సాగు చేయాలని చెబుతున్నాం. ఈ విధానంపై అవగాహన కల్పించిన తర్వాత కమిట్ అవుతున్నరు. ఒక్కో గ్రామంలో ముఖ్యమైన రైతులను ఎక్కువగా మోటివెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం.
– మధూకర్రెడ్డి, తిమ్మాపూర్ మండల కో ఆర్డినేటర్
తడిపొడి పద్ధతిని ప్రోత్సహిస్తున్నాం..
తడిపొడి పద్ధతిలో వరి సాగు చేయడం వల్ల రైతులకే కాకుండా కాలుష్య నివారణ కూడా జరుగుతుంది. ఈ విధానాన్ని గత రెండు మూడేళ్లుగా ప్రభుత్వం ప్రోత్సహి స్తున్నది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అక్కడక్కడా ఈ పద్ధతిని అనుసరించి వరి సాగు చేస్తున్నారు. ఈ బాధ్యతలు నిర్వహించేందుకు ఒక ఎన్జీవో ముందు కు వచ్చింది. ఈ సంస్థ జిల్లాలోని కొన్ని మండలాలను పైలట్గా తీసుకుని ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈ విధానానికి యాసంగి అనుకూలంగా ఉంటుంది. వరి పంట చివరి దశలో కొన్ని మండలాల్లో నీటి ఎద్దడి ఎదురవుతుంది. తడిపొడి విధానంలో వరిసాగు చేయడం వలన దిగుబడులు కూడా పెరుగుతాయి. ఎన్జీవోకు మా అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.
– వాసిరెడ్డి శ్రీధర్, డీఏవో (కరీంనగర్)