గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు అమలు చేస్తుండగా, నుస్తులాపూర్ ప్రగతిలో పరుగులు పెడుతున్నది. ఎమ్మెల్యే రసమయి సహకారం, సర్పంచ్ రమేశ్ కృషితో ఇప్పటికే రెండుసార్లు జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకున్న గ్రామం, అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే లెక్కకు మించిన పనులతో తళతళా మెరిసిపోతున్న గ్రామంలో రూ.40లక్షలతో ఆధునిక హంగులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం ముస్తాబైంది. ఆదివారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యే బాలకిషన్ చేతులమీదుగా ప్రారంభోత్సవం కానుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– తిమ్మాపూర్ రూరల్, జనవరి21
తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం ప్రగతిలో మెరిసిపోతున్నది. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుండగా, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని మండలంలోనే ఆదర్శ గ్రామంగా నిలుస్తున్నది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రాష్ట్ర నాయకుల సహకారం, సర్పంచ్ రమేశ్ కృషితో జిల్లాలోనే మోడల్ గ్రామపంచాయతీగా గుర్తింపు పొందింది. ఇప్పటికే ఉత్తమ గ్రామ పంచాయతీ, చైల్డ్ ఫ్రెండ్లీ విభాగాల్లో రెండు సార్లు జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నది.
అనేక అభివృద్ధి పనులు..
గత ప్రభుత్వాల హయాంలో గ్రామం అభివృద్ధిలో వెనుకబడింది. కానీ స్వరాష్ట్రంలో అన్ని వసతులు సమకూర్చుకుంటూ వస్తున్నది. సర్పంచ్ రావుల రమేశ్, ఎమ్మెల్యే రసమయి కృషితో ఇప్పటికే గ్రామంలో రూ.3కోట్ల పైచిలుకు నిధులతో సీసీ రోడ్లు, కులసంఘ భవనాలు, వైకుంఠధామం, ఊరంతా జిగేల్మనేలా సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఇంకా వైకుంఠధామం పూర్తికావడంతో అంత్యక్రియలకు సర్పంచ్ స్వయంగా వైకుంఠరథాన్ని ఏర్పాటు చేయించారు. ఇంకా పంచాయతీ ఆధ్వర్యంలో రూపాయికే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామంలో ఆడపిల్లలు జన్మిస్తే వారి పేరిట రూ.5వేలు ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి పథకాలు ప్రవేశపెట్టి సర్పంచ్ రమేశ్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రూ.40లక్షలతో కొత్త పంచాయతీ భవనాన్ని నిర్మించారు.
ఆధునిక హంగులతో భవనం.. నేడు ప్రారంభం..
పంచాయతీ భవనాన్ని సుమారు 20గుంటల స్థలంలో ఆధునిక హంగులతో నిర్మించారు. భవనంలో సర్పంచ్ క్యాబిన్, పాలకవర్గ మీటింగ్ రూం, ప్రజల వెయిటింగ్ రూం, కార్యదర్శి, ఈ పంచాయతీలకు ప్రత్యేక గదులు నిర్మించారు. అలాగే పాత గ్రామపంచాయతీ భవనాన్ని ఆరోగ్య కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. కాగా, ఆదివారం భవనాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ప్రారంభించనున్నారు.
ఎమ్మెల్యే సహకారంతోనే గ్రామాభివృద్ధి
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నుస్తులాపూర్ సమగ్రాభివృద్ధి చెందింది. ప్రతి కుల సంఘానికి భవనాన్ని నిర్మించుకున్నాం. ఇప్పటికే మా గ్రామం రెండు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నది. ఇదంతా ప్రజల సహకారం, పాలకవర్గం కృషితోనే సాధ్యమైంది. ఇదే ఉత్సాహంతో పనిచేసి జిల్లాలోనే మా గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుతాం. ఈ మధ్యే రూ.3కోట్లతో గ్రామంలో కావాల్సిన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మరో రూ.40లక్షల నిధులతో నూతన పంచాయతీ భవనాన్ని సైతం నిర్మించుకున్నాం. నేడు ప్రారంభించుకోబోతుండడం సంతోషంగా ఉంది.
– రావుల రమేశ్, నుస్తులాపూర్ సర్పంచ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు