పెద్దపల్లి, మార్చి 22(నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో ఎండకాలం దేవుడెరుగు వాన కాలం చివరిలోనే చెరువులు, కుంటలు నీళ్లు లేక నెర్రెలు బారేవి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్లో జలాలు అడుగంటిపోయేవి. కాలువలు తడారిపోయేవి. దీంతో రైతులు వేసిన పంట చేతికి రాక, పెట్టుబడి కూడా గిట్టుబాటు కాక అప్పుల పాలయ్యేది. పొద్దంతా చేపలు వేట కోసం వెళ్లే మత్స్యకారులు చేపలు చిక్కకపోవడంతో ఆర్థికంగా బక్కచిక్కిపోయేది. కానీ తెలంగాణ రావడంతో రాష్ట్ర సాగు స్వరూపమే మారిపోయింది. బృహత్తరమైన కాళేశ్వరం నిర్మాణంతో పెద్దపల్లి జిల్లా రైతాంగం దశ తిరిగింది.
ఇప్పుడు మండుటెండల్లో చెరువులు జలకళతో ఉట్టిపడుతున్నయ్. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి చొరవతో ఎస్సారెస్పీ నుంచి పుష్కలంగా నీళ్లు వస్తుండడంతో పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లోని చెరువులు, కుంటలకు జల కళ సంతరించుకున్నాయి. జిల్లాలో 1076చెరువులు, కుంట లు ఉండగా ఇందులో గొలుసుకట్టుగా ఉన్న చెరువుల్లోకి ఎస్సారెస్పీ నీరు చేరుతున్నది. డీ-83, డీ-86 కాలువల ద్వారా గత డిసెంబర్ నుంచి నీటి సరఫరా ప్రారంభం కాగా వారబంధీ పద్ధ్దతిలో నీటిని ఇస్తున్నారు. దీంతో డీ-83, డీ-86 కాలువల్లో నీళ్ల పరవళ్లు కనిపిస్తున్నాయి.
జిల్లాలో రైతు లు వరి పంటను వేస్తుండడంతో సాగు నీటికి రందీలేకుండాపోయింది. డీ-83 కాలువ కింద 1,03,339 ఎకరాలు, డీ-86క్రింద 79, 360ఎకరాలు సాగు అవుతున్నది. డీ-83 కాలువ కింద చొప్పదండి, ఎలిగేడు, జూలపల్లి, ధర్మారం, పాలకుర్తి, పెద్దపల్లి, కమాన్పూర్, అంతర్గాం, రామగుండం, కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి, మంథని మండలాల్లోని సుమారు 202 గ్రామాలకు సాగు నీరు అందుతున్నది. ఈ డీ-83 కెనాల్ కింద సుమారు 65 మైనర్(ఉప) కాలువ లు అనుసంధానంగా ఉన్నాయి. వీటి కింద 1,03,339 ఎకరాలకు సాగు నీరు సరఫరా అవుతున్నది. డీ-86 కాలువ కింద కరీంనగర్, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడ్, జూ లపల్లి, పెద్దపల్లి మండలాల్లోని 86 వేల ఎకరాలకు సాగు నీరందుతున్నది. ఇలా సాగు నీటిని విడుదల చేస్తున్న క్రమంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్తో పాటు చెరువులు, కుంటలు, బావులు, బోర్లలో జలాలు పుష్కలంగా వచ్చి చేరుతున్నాయి.
ఎస్సారెస్పీ కాలువల కింద గొలుసుకట్టు చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకి ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా డీ-86కాలువ కింద ఉన్న ఓదెల మండలంలోని కనగర్తిలో గల మెట్పల్లి చెరువు, దానకుంట, పెద్ద చెరువు, చింతకుంట, ఎల్లయ్యగారి కుంట, గోపరపల్లిలోని కోరుకుంట చెరువులు జలకళతో తొణికిసలాడుతున్నాయి. చెరువుల్లోకి పు ష్కలంగా నీరు చేరడంతో చెరువుల ఆయకట్టు కింది రైతులు, ఆ చెరువులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు చెరువుపై ఆధారపడ్డ మత్స్యకారులు చెరువులు ఎండిపోతున్న క్రమంలో చేపలు చనిపోవడంతో పాటుగా చెరువుల్లో నీరు తగ్గుతున్నప్పుడే చేపలు పట్టే వారు. దీంతో ఆ సమయంలో తక్కువ రేటు ఉండేది. అగ్గువ సగ్గువకే అమ్ముకునేది. కానీ ఇప్పుడు వేసవిలో పుష్కలంగా వచ్చి నీళ్లు చేరుతుండడంతో మార్కెట్లో చేపలకు ధర పలికినప్పుడల్లా అమ్ముకొని లాభపడే అవకాశం మత్స్యకారులకు కలిగింది. చెరువుల్లో నీళ్లు నిండుతుండటంతో రైతులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గీ ఎండకాలంలో గిట్ల ఎన్న డూ నీళ్లు రాలే. ఈ ఏడే అచ్చినయ్. మా పం టలకు ఇగ ఢోకా లేదు. నాకు ఈ చెరువు కింద రెండెకరాలున్నది. నీళ్లు అందక పంట సరిగా పండకపోయేది. గొడ్డూ గోదకు కూడా తాగేటందుకు నీళ్లు దొరకకపోయేది. పుష్కలంగా నీళ్లత్తన్నై. మాకిగ ఏ బాధ లేదు. రెండు కాలాల్లో బాగా పంటలు పండుతయ్.
– ఆవుల ఎల్లయ్య యాదవ్, రైతు, కనగర్తి (ఓదెల మండలం)
ఎండకాలం రానే అ చ్చింది. ఈ నెలల మా చెర్ల నీళ్లే ఉండే ది కాదు. కానీ ఈ ఏడు ఎస్సారెస్పీ నీళ్లు మస్తుగా వస్తు న్నై. కాళేశ్వరం ప్రా జెక్టు పుణ్యాన మా ప్రాంతం కూడా ఎస్సారెస్పీతో సస్యశ్యామలం అవుతున్నది. పంటలు బాగా పండుతాయి. ఇక రెండు పంటలకూ రందీలేదు. కాళేశ్వరం కట్టిన సర్కారు, శ్రీరాంసాగర్ నుంచి నీరు విడుదల చేయిస్తున్న ఎమ్మెల్యే సారుకు రుణపడి ఉంటం.
-ఆరెల్లి మొండయ్యగౌడ్, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు, కనగర్తి (ఓదెల మండలం)