జూలపల్లి, ఫిబ్రవరి 2 : మానకొండూరు మండలం వెల్ది గ్రామానికి ముస్లిం మహ్మద్ అబ్దుల్ సత్తార్ ప్రాచీన కళలకు జీవం పోస్తున్నాడు. మహా భారతం, రామాయణంలో ప్రధాన ఘట్టాలు తీసుకుని నాటక రంగంలో కళాకారులకు 14 ఏండ్ల నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాడు. ఏడో తరగతి దాకా చదివిన ఆయన, కుటుంబ పోషణ కోసం వ్యవసాయం, వంట పనులు చేస్తూ నాటక రంగంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. తన తాత ఫ్లూట్ వాయిద్యకారుడు నాజర్ హుస్సేన్ పాడిన భక్తి పాటలు, భజనలకు ఆకర్షితుడై ఇతిహాస పురాణాల వైపు అడుగులు చేశాడు. సీనియర్లు ననువాల రంగయ్య, బాల్సాని ఎల్లయ్యగౌడ్ ప్రోత్సాహంతో రంగ ప్రవేశం చేశాడు.
1993లో తొలిసారి ‘చిరుతల రామాయణం’ నాటక ప్రదర్శనలో రావణ బ్రహ్మగా సత్తార్ ప్రధాన పాత్ర పోషించాడు. గంభీరమైన కంఠం, పాత్రకు తగిన ఆహార్యంతో ప్రేక్షకుల నుంచి ఔరా అనిపించుకున్నాడు. 2009 నుంచి చిరుతల రామాయణం, రామాంజనేయ యుద్ధం, యక్షగానం, లవకుశ, భక్త మార్కండేయ, అల్లిరాణి చరిత్ర, గయోపాఖ్యానం, కర్ణ దుశ్శాసన వధ, చంద్రహాస చరిత్ర నాటక ప్రదర్శనలో కళాకారులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. ఒక బృందంలో దాదాపు 30 నుంచి 40 మందికి 45 రోజుల నుంచి 60 రోజుల దాకా శిక్షణ ఇస్తున్నాడు. ఎంతో పవిత్రమైన నాటక శిక్షణ కాలంలో కళాకారులు మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలని సూచిస్తాడు.