రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ పదేపదే కాంగ్రెస్ చేసిన ఆరోపణలను అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే కేటీఆర్ సమర్థవంతంగా తిప్పికొట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు సుంకపాక మనోజ్కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీచౌరస్తాలో ఎమ్మెల్యే కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం మనోజ్కుమార్ మాట్లాడుతూ, ఆరు గ్యారంటీలు, 441 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను తాము విమర్శించడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న అసత్యపు ఆరోపణలను తిప్పికొడుతూనే, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై వాస్తవాలను ప్రజలకు వివరించారన్నారు. బీఆర్ఎస్ యువజన విభాగం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుందన్నారు. ఒక మంచి నాయకుడు కేటీఆర్ మా సిరిసిల్ల ఎమ్మెల్యే కావడం ప్రజలంతా గర్విస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు మునీర్, వరుణ్, మన్సూర్, అఖిల్, మధు, జాఫర్, హరీశ్, సికిందర్, అప్రోజ్, పవన్, ఇమ్రాన్, సల్మాన్, యాదగిరి, పంగ మధు, శేఖర్, జావీద్, అమ్ము, అజ్జులు పాల్గొన్నారు.