కార్పొరేషన్, నవంబర్ 1: ఈ ఎన్నికల్లో మరోసారి అండగా నిలిచి తనను గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. బుధవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఫోర్ వీలర్స్ మెకానిక్స్, ఇంజినీరింగ్ రీకండిషన్, డెంటింగ్, పెయింటింగ్, లేట్ వర్కింగ్ ఎలక్ట్రిషన్, కార్ డెకర్స్, కార్ కన్సల్టెన్సీ, ట్రాక్టర్ మెకానిక్స్ అసోసియేషన్, సామిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఆయా సంఘాల నాయకులంతా ఈ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ను గెలిపిస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ పార్టీలని పేర్కొన్నారు. వారికి ఓటు వేస్తే తెలంగాణ గుడ్డిదీపంగా మారుతుందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టిన కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, మరోసారి దొంగల పాలు చేయవద్దన్నారు.
మన తాతలు తప్పు చేస్తే 50 ఏళ్లు తెలంగాణ అరిగోస పడ్డదన్నారు. ఇప్పుడు అదే తప్పు మనం చేస్తే భవిష్యత్ తరాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. నగరంలో పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను తీసుకువచ్చామని, ఏడాదిలో మానేరు రివర్ ఫ్రంట్ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో పూర్తి చేస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ ముసుగులో ఆంధ్రా నాయకులంతా హైదరాబాద్లో అడ్డ వేసి హైదరాబాద్ సంపదను దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మేయర్ యాదగిరి సునీల్రావు, కార్పొరేటర్ ఐలేందర్, నాయకుడు మేచినేని అశోక్రావు, ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్కు చెందిన పలువురు నాయకులు బుధవారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చేరిన వారిలో రాచమల్ల శ్రీధర్, మల్లారెడ్డి, రాచమల్ల సతీశ్, అశోక్, అనిల్తో పాటు 30 మందికి పైగా యువకులు ఉన్నారు.