డాక్టర్ కల నెరవేరకుండానే వైద్య విద్యార్థి అర్ధాంతరంగా తనువు చాలించాడు. స్నేహితుల దినోత్సవం రోజున మిత్రులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన అతడు కాంత వాగులో పడి గల్లంతయ్యాడు. 24 గంటల తర్వాత విగతజీవిగా నీళ్లపై తేలి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చాడు. గొప్ప ప్రయోజకుడిగా ఇంటికి తిరిగివస్తాడనుకున్న చెట్టంత కొడుకు నిర్జీవిగా కనిపించడంతో ఒక్కసారిగా బోరుమన్నారు. ‘కొడుకా మాతో మాట్లాడవా..మమ్మల్ని విడిచి ఎక్కడికెళ్తున్నావు బిడ్డా’ అంటూ గుండెలు బాదుకుంటూ రోదించారు.
వీర్నపల్లి, ఆగస్టు7: వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన వైద్య విద్యార్థి ప్రవీణ్ గల్లంతు విషాదాంతమైంది. స్నేహితులతో కలిసి వివాహారయాత్రకు ఆదిలాబాద్ జిల్లా శివఘట్ సందర్శనకు వెళ్లిన మెడికో మృత్యు ఒడికి చేరాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగంపేట మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నేత భూక్యా ఉస్మాన్, లక్ష్మి దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్ అదిలాబాద్ రిమ్స్లో గతేడాది ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అక్కడే పీజీ(ఆర్థోపెడిక్) ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా గత అదివారం సాయంత్రం ఎనిమిది మంది మిత్రులతో కలిసి జైనథ్ మండలంలోని శివఘట్ సందర్శనకు వెళ్లాడు.
సమీపంలోని కంతా కాలువలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కాలు జారిపడి గల్లంతయ్యాడు. అదేరోజూ సాయంత్రం నుంచి గాలించగా ఆచూకీ దొరకలేదు. సోమవారం ఉదయం ప్రవీణ్ మృతదేహం లభించింది. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. చేతికచ్చిన కొడుకు వాగులో పడి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధిత కుటుంబ సభ్యులను ఎంపీపీ మాలోత్ భూల, జడ్పీటీసీ గుగులోత్ కళావతి, సర్పంచ్ నందగిరి లింగం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, బంజార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్నాయక్ పరామర్శించారు.
కొడుకు మృతిపై అనుమానం..
తమ కొడుకు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు ఆరోపించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరుతున్నారు. కండ్లకు గంతలు కంటి ఉండడమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని జైనథ్ సీఐ కొల నరేశ్, ఎస్ఐ పురోషోత్తం తెలిపారు.
బాధిత కటుంబానికి మంత్రి కేటీఆర్ ఫోన్..
మంత్రి కేటీఆర్ ప్రవీణ్ తండ్రి భూక్యా ఉస్మాన్కు ఫోన్ చేశారు. ప్రవీణ్ మరణం తనను ఎంతగానో బాధించిందని చెప్పారు. అధైర్యపడవద్దని అన్ని విధాల అండగా నిలుస్తానని భరోసానిచ్చారు.
ప్రవీణ్ మృతి కలిచివేసింది: వినోద్
వైద్య విద్యార్థి ప్రవీణ్ మృతిచెండం పట్ల ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. శివఘట్ సందర్శనకు వెళ్లి గల్లంతు కావడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. వారి కు టుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రవీణ్ మరణ వార్త తెలుసుకున్న నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సీఐడీ ఎస్పీ భూక్యా రాంరెడ్డినాయక్ సంతాపాన్ని ప్రకటించారు.