గంగాధర, ఫిబ్రవరి 3: ‘గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చినవన్నీ 420 హామీలే. దొంగ హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మరి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నదా..? అంటే చేసినట్లే చేసి ప్రజలను మభ్యపెడుతున్నది.’ అంటూ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మండిపడ్డారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని మొండి సంజయ్ అనుకోవాలని, ఉత్త మాటలు చెప్పడమే తప్ప నిధులు తేవడం ఆయనకు చేతకాదని విమర్శించారు. వినోద్ కుమార్ లాంటి మేధావిని గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే కరీంనగర్కు స్మార్ట్ సిటీని, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను తెచ్చినట్టు అనేక అభివృద్ధి పనులకు నిధులు తెస్తారని పేర్కొన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయడానికి కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గంగాధర మండలం మధురానగర్లోని వీఏఎస్ గార్డెన్లో శనివారం నిర్వహించిన చొప్పదండి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి మాజీ ఎంపీ వినోద్కుమార్తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడారు. ఒకనాడు ఎట్లుండె తెలంగాణ.. ఇప్పుడెట్ల అయిందో గమనించాలని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్గా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు. మిషన్ కాకతీయ కింద చెరువులను పునరుద్ధరించి, రాష్ట్రంలోని 40 వేల చెరువులకు కేసీఆర్ పూర్వ వైభవం తెచ్చారని, కోటి ఎకరాలకు సాగు నీరందించారని గుర్తు చేశారు. పల్లె ప్రగతితో గ్రామాలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దారన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు.
ఆ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలన్నీ 420 హామీలనీ, వాటిని అమలు చేయడంలో ఫెయిల్ అవుతున్నారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు, కొత్త జయపాల్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఆరు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గడిచిన ఐదేండ్లలో రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయి. నిజాలు దాచి, అబద్ధాలు ప్రచారం చేశాయి. కాంగ్రెస్ వారంటీలేని గ్యారెంటీలు ఇచ్చి, పూర్తి అబద్ధాలతో గెలిచింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిండు. 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు. కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు ఇచ్చారో..? లేదో..? సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి సమాధానం చెప్పాలి.
కేసీఆర్ ప్రభుత్వం 7వేల స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చి, ఆ ఉద్యోగాలు వాళ్లే ఇచ్చినట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది. స్టాఫ్ నర్సు కొలువులే కాదు ఇంకా 40వేల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినం. కోర్టుల్లో కేసుల ద్వారా నియామకాలు జరగలేదు. మరో 32వేల ఖాళీలను కూడా గుర్తించినం.
కాంగ్రెస్ సరారుకు దమ్ముంటే ఇచ్చిన హామీ మేరకు ఈ యేడాదిలోగా 2లక్షల ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి బండి సంజయ్ చేసేందేమీలేదు. నయాపైసా అభివృద్ధి చేయలేదు. మేం చేసిన అభివృద్ధి చెప్పుకోలేదు. కానీ, కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేసినయి. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయం. బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పట్టుదలతో పని చేయాలి.
– బోయినపల్లి వినోద్కుమార్, కరీంనగర్ మాజీ ఎంపీ