మంథని, నవంబర్ 4: ‘ఈ మట్టిలో పుట్టిన మీ బిడ్డగా మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్నా.. ఓటు ద్వారా నన్ను ఆశీర్వదిస్తే మంథనితోపాటు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా. గెలిచిన వెంటనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తా. నా తల్లి పేరిట ఏర్పాటు చేసిన పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తా’ అని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ హామీనిచ్చారు. కాంగ్రెస్కు ఓటేస్తే నియోజకవర్గం అంధకారమవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంతలాభం చూసుకొని ప్రజలను గాలికి వదిలేశాడని నిప్పులు చెరిగారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఆపదలో ఉన్నవారికి సాయం చేయలేదని దుయ్యబట్టారు. మంథని పట్టణ పరిధిలోని బోయినిపేట, దుబ్బగూడెం, తెనుగువాడ, గొల్లగూడెం ఏరియాల్లో శనివారం మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజతో కలిసి ఆయన ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. ఇక్కడి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐదేండ్లు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. ఇప్పుడు ఓట్ల కోసం ఊర్లకు వచ్చి అబద్ధాలు చెబుతున్నాడన్నారు. నోట్ల కట్టల ద్వారా ఓట్లను కొనుగోలుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు ఆయన మాయమాటలు నమ్మవద్దన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా, ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్గా, తన సతీమణి శైలజ మంథని సర్పంచ్గా, మున్సిపల్ చైర్పర్సన్గా అనేక అభివృద్ధి పనులు చేశామని చెప్పారు.
ఇదంతా మీ కండ్ల ముందరే కనిపిస్తున్నదన్నారు. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించామని పేర్కొన్నారు. దుబ్బగూడెంలో సీసీ రోడ్డు నిర్మించి ఇక్కడి ప్రజల కష్టాలను తీర్చానన్నారు. బీసీ బిడ్డ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొందరు అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రజలు ఆలోచించి తనను ఓటుతో ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ నెల 7న మంథనిలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు కదిలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎగోలపు శంకర్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులు నక్క నాగేంద్ర శంకర్, వీకే. రవి, కాయితీ సమ్మయ్య, కొట్టే రమేశ్, శ్రీపతి బానయ్య, వెల్పుల గట్టయ్య, ఎంఎస్.రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కాగా బోయినిపేటలోని గొల్లగూడెంలో యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
మంథని, నవంబర్ 4: బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. మంథనిలోని రాజగృహలో మంథని మండలం అక్కెపల్లి గ్రామానికి చెందిన యువకులు, కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు, మహిళలు, ముత్తారం మండలం పారుపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, మహదేవపూర్ మండలం బెగ్లూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి ముత్యాల మల్లగౌడ్, పంతంగి మొండయ్య, అగె సంపత్, సకినాల లక్ష్మీనారాయణ, మేకల సంపత్, సురేశ్, 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, రామగిరి మండలం చందనాపూర్కు చెందిన వార్డు సభ్యులు ముస్త్యాల పుష్పలత సంతోష్, మహదేవపూర్ మండలం ఎన్కపల్లి, కిష్టరావుపేటకు చెందిన 100 మంది కాంగ్రెస్ నేతలు, బోయినిపేటకు చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి పుట్ట మధూకర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ కష్టపడ్డవారికి పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.