MLA Gangula Kamalakar | కమాన్ చౌరస్తా, ఆగస్టు 11 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో వెలసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనాల వేడుకకు హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు స్థానిక కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. మహిళా భక్తులు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం గంగుల కమలాకర్ అమ్మవారి బోనం ఎత్తుకుని ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
శివశక్తుల పూనకాలతో బోనాల వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య కోలాహలంగా సాగాయి. ఈ సందర్భంగా అమ్మవారి పూనకం వచ్చిన ఓ మహిళా భక్తురాలు మైసమ్మ తల్లికి శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. ఎల్లమ్మ తల్లి కలలో కనిపించి తాను స్థానిక పెంటకుప్పలో వెలిశానని తెలిపిందని, దీంతో కాలనీవాసులంతా కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గంగుల కమలాకర్ మాట్లాడుతూ వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
బోనాల వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, జీపీ స్వామి, స్థానిక కాలనీవాసులు ఎల్లయ్య, బాల్ రెడ్డి, శేఖర్, సుధాకర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.