Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 5 : యువత కదం తొక్కి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ప్రభుత్వం మెడలు వంచాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. యువతను నమ్మించి కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన తీరు నిరసిస్తూ పోరుబాటలో భాగంగా శనివారం వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో విద్యార్థులు యువతతో కలిసి పోరుబాట నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలను వేసిన అనంతరం రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా త్రినేత్ర ఫంక్షన్ హాల్ వరకు వెళ్లి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఐదు లక్షల విద్యా భరోసా, ఫీజ్ రియంబర్స్మెంట్ లాంటి పథకాలను అమలు చేస్తామని నమ్మించి ఓట్లు దండుకున్నాడని ఆరోపించారు.
యువతకు 4వేల నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ లాంటి హామీలను ఇచ్చి విస్మరించాడని అన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగు పడడం దేవుడికి ఎరక కానీ రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన నాటి నుండి ప్రతి ఏడాది 1500 పాఠశాలలను మూసివేస్తున్నారంటూ ఆరోపించారు. గురుకుల పాఠశాలలో చదువుకునే నిరుపేద విద్యార్థులకు అందించే ఆహారంలోనూ కలుషిత ఆహారంతో అనేకమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని అసమర్ధ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. వంద రోజుల్లో డీఎస్సీ ప్రకటిస్తామని వెయ్యి రోజులైనా దిక్కు లేదన్నారు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని మోసం చేశారన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లోను జీవో నెంబర్ 97 ను ప్రవేశపెట్టి ముందుగా విద్యార్థులు చెల్లిస్తే వారి ఖాతాలోకి ప్రభుత్వం వేస్తుందని అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ చెప్పడం సిగ్గుచేటు అన్నారు. 45 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు కోసం రుద్రంగిలో భూమి పూజ చేస్తే ఇంతవరకు కనీసం ఆది శ్రీనివాస్ పనులు కూడా ప్రారంభించలేకపోయాడని ఆవేదనపడ్డారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి, పట్టణ కౌన్సిలర్లు వెంగల అనితా శ్రీకాంత్ గౌడ్, వాసాల లావణ్య శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశేట్టి విజయ్, సిరిగిరి రామచందర్, మారం కుమార్, గోలి మహేష్, సీనియర్ నాయకులు గూడూరు మధు, క్రాంతి కుమార్, నియోజకవర్గం విద్యార్థి సంఘం నాయకులు పోతూ అనిల్, పసుల అంజి, మండలాల అధ్యక్షులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
స్కూటీలు ఇంకెప్పుడు ఇస్తారు : గోనెల శ్రావ్య, విద్యార్థిని (వేములవాడ)
స్కూటీలు ఇస్తానని ఎన్నికల సమయంలో చెప్పాను ఇంకెప్పుడు ఇస్తారు. స్కూటీలు ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ పై చదువుకోడానికి ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం ఇవ్వండి. చదువులు మధ్యలోనే ఆగితే మీరిచ్చిన స్కూటీలు కూడా మధ్యలోనే ఆగిపోతాయి. చదువుకోడానికి అవకాశం ఇవ్వండి. ఫీజు రియంబర్స్మెంట్ అనేది మా భవిష్యత్తు నిర్ణయించుకునే అవకాశం లాంటిదని మీలాంటి వారికి తెలియకపోవడం బాధాకరం.