ఇబ్రహీంపట్నం, అక్టోబర్,27 : అరవై ఏండ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో మోసపోయిందని, తెలంగాణకు చేసిందేమీ లేదని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ప్రతిపక్షాలు మీ వద్దకు వచ్చి మాయమాటలు చెబుతూ మిమ్మల్ని ఆగం చేయాలని చూస్తున్నారన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుతో కలిసి మండలంలోని అమ్మక్కపేట, డబ్బ, వర్షకొండ, కొమటి కొండాపూర్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అర్వింద్ ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఏ ఒక్క పని అయిన చేశాడా..? ఆలోచించాలని, ఏం ముఖం పెట్టుకొని కోరుట్లలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వస్తున్నాడని అన్నారు. కులాలు, మతాల పేరుతో రెచ్చగొట్టడమే కానీ, అభివృద్ధి చేసిందేమీ లేదని పేర్కొన్నారు.
జువ్వాడి నర్సింగరావు కూడా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఎన్నికలు రాగానే నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలను ఆగం చేస్తున్నారని, ప్రజలు ఆగం కావద్దని, పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి నిధులను వెచ్చించి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కేసీఆర్ అందిస్తున్న పథకాలు, మ్యానిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అంతకు ముందు ఆయా గ్రామాల్లో ప్రజలు, మహిళల మంగళహారతులు, డప్పు చప్పుళ్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు ఘన స్వాగతం పలికారు.
ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ జాజాల భీమేశ్వరి, జడ్పీటీసీ కంఠం భారతి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పొన్కంటి వెంకట్, సర్పంచులు సుద్దాల దివ్యవాణి, లింగంపెల్లి గంగాధర్, దొంతుల శ్యామల, కొప్పెల శ్రీనివాస్, ఎంపీటీసీలు గుగ్లావత్ లక్ష్మి, జలేశ్, నాయకులు సత్యనారాయణ, జగన్రావు, రమేశ్, చిన్నారెడ్డి, రాజన్న, తుక్కారాం, సురేష్రెడ్డి, జీవన్, రెబ్బటి రాజేందర్, నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై అమ్మక్కపేటలోని ముదిరాజ్ సంఘ సభ్యులు, డబ్బాలో రజక సంఘ సభ్యులు ఏకగ్రీవ తీర్మాణం చేసి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను గెలిపించుకుంటామని డాక్టర్ సంజయ్ కల్వకుంట్లకు అందించారు. కాగా రజక సంఘ సభ్యులు ఎన్నికల ప్రచారం కోసం రూ.5వేలు డాక్టర్ సంజయ్ కల్వకుంట్లకు అందించారు. 150 మంది పప్జీ, ఆదర్శ యూత్ మహిళలు డబ్బ సర్పంచ్ గంగాధర్ ఆధ్వర్యంలో, వర్షకొండలో 50మంది యువకులు సర్పంచ్, ఎంపీటీసీ ఆధ్వర్యంలో అలాగే కోమటి కొండాపూర్ సర్పంచ్ కొప్పుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ నుంచి పది మంది బీఆర్ఎస్లో చేరారు. డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
సంజయ్ను భారీ మెజార్టీతో గెలిపించండి
– కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు
తనను ఆదరించి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. తనను ఆదరించినట్లుగానే తన తనయుడు డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన కొడుకు మంచి డాక్టర్ అని, ఆ వృత్తిని వదిలి మీకు సేవ చేయడానికి వస్తున్నాడని, ప్రజలు ఆశీర్వదించి మరింత అభివృద్ధికి సహకరించాలన్నారు. యువతకు అండగా నిలిచి స్వయం ఉపాధికి వెన్నంటే నిలుస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఐటీ ద్వారా ఉద్యోగ అవకాశాల కోసం కృషి చేస్తున్నాడన్నారు.