కొండగట్టు ఆలయ దుకాణాల లీజుకు సంబంధించిన డబ్బుల గోల్మాల్ వ్యవహారం, విధుల్లో నిర్లక్ష్యం చూపిన ఉద్యోగులపై చర్యలకు ఉన్నతాధికారులు వెనుకడుగు వేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈవో మినహా మిగతా వారిపై ఎలాంటి చర్యలూ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మల్యాల, ఏప్రిల్ 14 : షాపుల లీజు వసూలు వ్యవహారంపై గత నెల 18న ‘కొండగట్టు లీజులో గోల్మాల్’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో కథనం ప్రచురితం కావడంతో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు స్పందించి విచారణకు ఆదేశించారు. దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ 19న కొండగట్టుకు చేరుకొని, కార్యాలయంలోని లీజుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నగదు వ్యవహారాల్లో రికార్డులు సరిగా లేకపోవడం, ఈవో పర్యవేక్షణా లోపంతోనే లీజు ద్వారా వచ్చిన నగదును ఆలయ ఖాతాల్లో జమ చేయలేదని, పక్కదారి పట్టినట్లు నిర్ధారించారు.
కొన్నేళ్లు ఉన్న ఆడిట్ అభ్యంతరాలను సైతం పరిశీలించకపోవడం, రీకాన్సిలేషన్ చేయకపోవడంలో ఈవో నిర్లక్ష్యం చూపారని ప్రాథమికంగా తేల్చి, దేవాదాయ శాఖ కమిషనర్కు 22న నివేదిక అందజేశారు. ఆలయ పద్దు పుస్తకాల నిర్వహణ, పర్యవేక్షణ లోపభూయిష్టంగా ఉండడం వల్లే సిబ్బంది నగదు విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే కారణంతో గత నెల 23న ఈవో టంకశాల వెంకటేశ్ను సస్పెండ్ చేయడంతోపాటు కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్కు కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ ధర్మాధాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు.
అలాగే, పక్కదారి పట్టిన 81,56,950కు సంబంధించి ఆలయ పద్దు పుస్తకాల నిర్వహణ, పర్యవేక్షణాలోపం నిర్లక్ష్యంపై టెండర్ సెక్షన్ ఇన్చార్జితోపాటు సంబంధిత సెక్షన్ పర్యవేక్షకుడు, ఏఈవోపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అదే రోజు ఉత్తర్వులు జారీ చేశారు. అయినా, ఆలయ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవో స్థాయి అధికారిపైన వేటు వేసినా.. కింది స్థాయి ఉద్యోగులపై చర్యలెందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇటీవలే కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించా. రికార్డులు పరిశీలిస్తున్నాం. దేవాదాయ కమిషనర్ ఆదేశాలను రెండు మూడు రోజుల్లో అమలు చేస్తాం. నిధుల గోల్మాల్కు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యం చూపిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటాం.
– చంద్రశేఖర్, ఆలయ ఈవో,కొండగట్టు దేవస్థానం