కార్పొరేషన్, ఏప్రిల్ 8: కరీంనగర్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మెబాట పడుతున్నారు. నాలుగు నెలలకు సంబంధించిన పీఆర్సీ ఏరియర్స్ చెల్లించకపోవడం, అధికారులుకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సమ్మెకు సంబంధించిన నోటీసులను నగర కమిషనర్కు అందించగా, బుధవారం నుంచే నిరసనకు దిగుతున్నారు. వివరాల్లోకి వెళితే.. 2021 ఏప్రిల్లో అప్పటి సీఎం కేసీఆర్ పారిశుధ్య కార్మికులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించారు.
అదే సంవత్సరం జూన్ నుంచి అమలు చేశారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏరియర్స్ రావాల్సి ఉండగా కరీంనగర్ నగరపాలక అధికారులు ఇప్పటివరకు కేవలం జూన్, జూలైకు సంబంధించిన బకాయిలు మాత్రమే చెల్లించారు. మిగిలిన నాలుగు నెలల ఏరియర్స్ ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇచ్చినా కరీంనగర్లో మాత్రం కొందరికి పెండింగ్లో పెట్టారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో 1065 మంది కార్మికులు పని చేస్తుండగా, ఇందులో 800 మందికిపైగా పీఆర్సీ ఏరియర్స్ రాలేదు. అయితే అధికారులను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని, ఈ క్రమంలోనే సమ్మెలోకి వెళ్తున్నామని కార్మికులు చెబుతున్నారు.
ఈ నెల 10 నుంచి మొదలయ్యే సమ్మెకు పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరుకావాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. ఆరు నెలలకు సంబంధించిన ఏరియర్స్లో కేవలం రెండు నెలల ఏరియర్స్ మాత్రమే చెల్లించారని, నాలుగు నెలలు పెండింగ్లోనే పెట్టారన్నారు. ఒక్కో కార్మికుడికి సుమారుగా రూ.15 వేల మేర రావాల్సి ఉందన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో చెల్లించారని, కరీంనగర్లోనే పెండింగ్లో పెట్టారని చెప్పారు. ఈ విషయమై పలుమార్లు నగర కమిషనర్ను కలిసి విన్నవించినా పట్టించుకోలేదని, ఈ క్రమంలోనే బుధవారం నుంచి సమ్మెలోకి దిగుతున్నామని, నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతామని వివరించారు.