కరీంనగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై ఉమ్మడి జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని వర్గాలకు తాయిలాలు ఇస్తూ.. వడ్డీంపులు లేకుండా మోదీ సర్కారు జాగ్రత్త పడింది. అయితే, ఎన్నో ఏండ్లుగా ఎదురురూస్తున్న వేతన జీవులకు మాత్రం మళ్లీ నిరాశనే మిగిల్చింది. ఆదాయపన్ను చెల్లింపుల్లో పెద్దగా మార్పు చేయకుండా ఆశలపై నీళ్లు చల్లింది.
తాము అధికారంలోకి వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గత ఎన్నికల సమయంలో ప్రకటించినా.. అందుకు సంబంధించి ఎలాంటి వార్త లేకపోవడంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. అలాగే, ఉమ్మడి జిల్లా రైల్వే రంగానికి సంబంధించి ఆశించిన స్థాయిలో కేటాయింపులు కనిపించ లేదు. కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వేలైన్ పనులకు 350 కోట్లు, రామగుండం నుంచి మణుగూరు నూతన రైల్వే మార్గానికి సంబంధించి 5 కోట్లు కేటాయించినా.. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోలేదు. కరీంనగర్-హసన్పర్తి రైల్వేమార్గం ఊసే లేదు.
పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే మార్గం డబ్లింగ్ పనుల గురించి ప్రస్తావనే లేదు. ఇక వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి ఉపాధి కల్పించే అతిపెద్ద టెక్స్టైల్ పరిశ్రమ ఇప్పటికే సంక్షోభంలో ఉన్నా.. ఎలాంటి చేయూతనివ్వలేదు. తాజా బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందని, సిరిసిల్లలో మోగా క్లస్టర్ ఏర్పాటు చేస్తుందని ఎదురుచూసినా.. కేంద్రం మాత్రం మరోసారి సవతి ప్రేమను చూపింది. మొత్తంగా బడ్జెట్ను చూస్తే కొంత మోదం.. కొంత ఖేదం అన్నట్టుగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రోగ్రెస్ రిపోర్టు చదివినట్టుగానే ఉన్నది. అలాగే, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే కావడంతో ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం. లోతుగా చూస్తే.. చెప్పుకోదగిన స్థాయిలో ఏమీ లేదు. ఎన్నికలు పూర్తయ్యాక ప్రవేశపెట్టే బడ్జెట్లో అసలు విషయం బయటకు వస్తుంది. దానినే పూర్తి బడ్జెట్గా భావించాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూస్తే.. ఏమిచేస్తామో బడ్జెట్లో చెప్పకుండా.. పదేళ్లలో ఏమి చేశామో చెప్పే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది.
– బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎంపీ
కేంద్రం మళ్లీ వేతన జీవులను పూర్తిగా నిరాశ పరిచింది. తాజా బడ్జెట్లో ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి నూతనంగా ఒక్క వెసులుబాటు కల్పించలేదు. 2014కు ముందు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బీజేపీ ఆదాయ పన్ను పరిమితి పెంచాలని డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే పన్ను శ్లాబులను హేతుబద్ధీకరిస్తామని, పన్ను రేట్లను తగ్గిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. మోదీ సర్కారు పదేళ్లలో ప్రత్యక్ష పన్నుల్లో ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు.
అలాగే పన్ను రేట్లను తగ్గించలేదు. ఆకర్షణీయంగా లేని కొత్త పన్నుల విధానం అమల్లోకి తెచ్చి అయోమయం సృష్టించింది. కనీసం 80 సీ, 80 డీ ఇంటి అద్దె, విద్య, గృహ రుణాలపై వడ్డీ, తదితర మినహాయింపులు వర్తింపజేయాలని ఏళ్లుగా సంఘాలు కోరుతున్నా.. పట్టించుకోకపోవడం అన్యాయం. బడ్జెట్ ప్రతిపాదనలకు సవరణలు చేసి పన్నుల భారం తగ్గించి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కాస్తయినా ఉపశమనం కలిగించాలి. ప్రత్యక్ష పన్ను మినహాయింపు పరిమితిని 10 లక్షలకు పెంచాలి.
– మానేటి ప్రతాప్రెడ్డి, రిటైర్ట్ హెచ్ఎం
కేంద్రం మరోసారి నిరుద్యోగులు, రైతులను పూర్తిగా నిరుత్సాహ పరిచింది. దేశంలో 70 శాతం మంది వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన నాడు.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. అలాగే, తాము అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గత ఎన్నికల సమయంలో పలుసార్లు హామీ ఇచ్చారు. కానీ, ఆయా వర్గాలకు సంబంధించి తాజా బడ్జెట్లో ఎటువంటి ప్రోత్సాహం కనిపించలేదు. అన్నదాతలకు ప్రోత్సాహకరమైన కేటాయింపులు లేవు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతామని కూడా ప్రకటించలేదు.
యువత పెరుగుతున్నది. దేశంలో నిరుద్యోగం కూడా పెరుగుతున్నది. ఈ బడ్జెట్లో ఏదైనా వార్త ఉంటుందని ఆశించిన నిరుద్యోగులకు పూర్తిగా నిరాశే మిగిలింది. అలాగే, వేతన జీవులపై కేంద్రం మరోసారి వివక్ష చూపింది. ఏండ్ల కేండ్లుగా ఎదురుచూస్తున్న ఆదాయ పన్ను పరిమితిని పెంచకుండా తీవ్రంగా నిరాశపరిచింది. మారిన ప్రజల జీవన విధానానికి అనుగుణంగా ఖర్చులు పెరుగుతున్నా.. ఈ విషయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు.
– జీవీ రామకృష్ణరావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంగా పని చేస్తున్నది. ఆ దిశగానే కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అన్ని వర్గాలకు మేలు చేసేలా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 7 లక్షల వరకు నో టాక్స్ వల్ల మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభిస్తుంది. ఆదాయ పన్ను మినహాయింపు, కార్పొరేట్ టాక్స్ను 30 నుంచి 22 శాతానికి తగ్గించడం శుభపరిణామం. ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు పథకం వర్తింపజేయడం మంచి విషయం.
అలాగే, మధ్యతరగతి ప్రజల కోసం నూతన గృహ విధానాన్ని తీసుకొచ్చి బస్తీలు, అద్దె ఇండ్లలో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామని, పీఎం ఆవాస్ యోజన కింద కొత్తగా రెండు కోట్ల ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తామని ప్రకటించడం హర్షనీయం. సోలార్ పాలసీ ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, నానో డీఏపీ కింద ఎరువులు అందించడం ప్రజలు, రైతులకు మేలు చేసేలా ఉన్నాయి.
– గంగాడి కృష్ణారెడ్డి, బీజీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి ఎటువంటి మార్పులు లేవు. సెక్షన్ 87 ఏ ప్రకారం ఏడు లక్షల వరకు మినహాయింపు వర్తిస్తుంది. పాత శ్లాబ్ ప్రకారం ఐదు లక్షల రుపాయల వరకే వర్తిస్తుంది. కార్పొరేట్ పన్నుల్లో కొంత శాతం తగ్గింపు చేసింది. సోలార్ను ప్రోత్సహించడం హర్షించదగిన విషయం. అయితే, చెప్పుకునే స్థాయిలో బడ్జెట్ లేదు.
– వెంకటేశ్వర్లు, టాక్స్ అడ్వకేట్
ఇది ఎన్నికల బడ్జెట్గానే కనిపిస్తున్నది. నిశితంగా పరిశీలిస్తే ఎక్కడా వడ్డింపులు మాత్రం లేవు. వడ్డింపులు చేస్తే.. ఎన్నికల్లో ప్రభావం ఉంటుందని ప్రభుత్వం భావించినట్టు ఉన్నది. పూర్తిస్థాయి బడ్జెట్లో మాత్రం కచ్చితంగా వడ్డింపులు ఉండే అవకాశముంటుంది. అలాగే, వ్యవసాయరంగానికి కేటాయింపులు బాగానే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మాత్రం ప్రత్యేకంగా బడ్జెట్ ఏమీ కనిపించడం లేదు. రైల్వేకు సంబంధించి ఉమ్మడి జిల్లా నుంచి అనేక డిమాండ్లు కేంద్రం వద్ద పెడింగ్లో ఉన్నా.. ఏ ఒక్క దానిపై మాత్రం స్పందన లేదు.
– గౌరిశెట్టి మునీందర్, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు