కొత్తపల్లి, ఫిబ్రవరి 3 : కనీస వసతుల్లేక శిథిలమైన సర్కారు పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడుతలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఎనిమిది స్కూళ్లను ఎంపిక చేసి 12 రకాల పనులు చేపట్టారు. చింతకుంట మండల పరిషత్ పాఠశాలలో పనులు పూర్తికావడంతో నాలుగు రోజుల క్రితమే (ఫిబ్రవరి 1న) మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. 27 లక్షలు వెచ్చించి ఈ స్కూల్లో అన్ని వసతులు కల్పించారు. చుట్టూ ప్రహరీ నిర్మించారు. సూల్ భవనాన్ని తీరొక్క రంగులతో ముస్తాబు చేశారు. పిల్లలు కూర్చునేందుకు డెస్క్లు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో కొత్త బ్లాక్ బోర్డులు అమర్చారు. ఆధునీకరించిన టాయ్లెట్లను అందుబాటులోకి తెచ్చారు. వాటర్ట్యాంక్లను నిర్మించి భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు నల్లాలను బిగించారు. స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు. విశాలమైన వంటగదిని నిర్మించారు. క్లాస్రూంలకు అంతర్గత వైరింగ్ చేయించి కరెంట్ సౌకర్యాన్ని కల్పించారు. విద్యార్థులు ఆటలు ఆడుకునేలా ప్లే గ్రౌండ్ను తీర్చిదిద్దారు. ఇలా సకల వసతులు కల్పించిన పాఠశాలలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చదువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్ను మించి కల్పించిన సౌకర్యాలను చూసి పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి అంకురార్పణ చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని మనసారా అభినందిస్తున్నారు.
పాఠశాల కొత్తగా కనిపిస్తున్నది
మన ఊరు – మన బడి పథకం కింద చింతకుంట మండల పరిషత్ పాఠశాల కొత్తగా కనిపిస్తున్నది. స్కూల్ బిల్డింగ్కు రంగులు వేయడంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నది. సకల సౌకర్యాలతో ప్రశాంత వాతావరణం నెలకొన్నది. చుట్టూ ప్రహరీ నిర్మించడంతో విద్యార్థులు నిశ్చింతగా చదువుపై దృష్టిపెడుతున్నారు. క్లాస్రూముల్లో కొత్త బ్లాక్బోర్డులు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. అభినందనీయం.
– నారాయణస్వామి, ప్రధానోపాధ్యాయుడు, మండల పరిషత్ పాఠశాల (చింతకుంట)