తెలంగాణచౌక్, మే 28: కులాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని పద్మనాయక వెలమ సంఘం జిల్లా అధ్యక్షుడు జువ్వాడి మన్మోహన్రావు డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్భవన్లో శనివారం జిల్లా నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కులాల మధ్య చిచ్చుపెట్టేలా వెలమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాకతీయ కాలం నుంచి వెలమలు కుల మతాల తారతమ్య భేదాలు లేకుండా కలిసి మెలిసి ఉంటున్నారని పేర్కొన్నారు.
రాజకీయ అవసరాల కోసం కులాల మధ్య విద్వేషాలను సృష్టించవద్దన్నారు. వెలమలు అన్ని పార్టీల్లో కొనసాగుతు ప్రజాసేవ చేస్తున్నారనే విషయం రేవంత్ గుర్తుంచుకోవాలని సూచించారు. కుల మతాల పేరుతో చిచ్చుపెట్టే పార్టీ నాయకులను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బుద్దినేని నర్సింగారావు, ప్రధాన కార్యదర్శి బల్మూరి ప్రసాద్రావు, సంయుక్త కార్యదర్శి అమరేందర్రావు పాల్గొన్నారు.