చిగురుమామిడి, నవంబర్ 19: ప్రతి ఇంటా మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకొని, దాన్ని వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. టాయిలెట్ డే సందర్భంగా మండలంలోని గాగిరెడ్డిపల్లె పరిధి బోల్లోనిపల్లెలో శనివారం స్వచ్ఛతా రన్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అనంతరం పాఠశాలలో సర్పంచ్ సన్నిళ్ల వెంకటేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, 2014లో స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా జిల్లాలో అనేక గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామన్నారు.
ఈజీఎస్ ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మరుగుదొడ్డి లేని వారు మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. యూనిసెఫ్ ద్వారా జిల్లాకు 17 లక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే అంటువ్యాధులు దరిచేరవన్నారు. రెండో విడుతలో గాగిరెడ్డిపల్లె గ్రామపంచాయతీకి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తామన్నారు.
కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక, ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, డీపీవో వీర బుచ్చయ్య, డీఆర్డీవో శ్రీలత, సర్పంచులు సన్నిళ్ల వెంకటేశం, సుద్దాల ప్రవీణ్, బోయిని శ్రీనివాస్, ఉప సర్పంచ్ అన్నాడి మల్లికార్జున్రెడ్డి, ఎంపీడీవో నర్సయ్య, మండల పరిషత్ సూపరింటెండెంట్ ఖాజా మొయినుద్దీన్, ప్రధానోపాధ్యాయులు రామచంద్రారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మండల వైద్యాధికారి నాగ శేఖర్, ఎస్ఎంసీ చైర్మన్లు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సీఏలు, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మానకొండూర్ రూరల్, నవంబర్ 19: ప్రపంచ మరుగు దొడ్డి దినోత్సవం సందర్భంగా మండలంలోని ముంజంపల్లిలో శనివారం సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా రన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ర్యాలీని తీస్తూ, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణి, ఏఎన్ఎం శ్యామల, ఆశ వర్కర్ భాగ్య, అంగన్వాడీ టీచర్లు, మహిళా గ్రూప్ సభ్యులు, వార్డు సభ్యులు నాగపూరి మల్లేశం, దామోదర్ రెడ్డి, టీ(బీ)ఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు నందగిరి మల్లయ్యాచారి, నాయకులు వెంకట రెడ్డి, మల్లారెడ్డి, నర్సింహారెడ్డి, వెనవెంక రామన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.