తెలంగాణచౌక్, నవంబర్ 10: మునుగోడు ఓటమిని జీర్ణించుకోలేకే మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తున్నదని ప్రజా సంఘల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రామగుండం పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీని అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. నగరంలోని శ్వేత హోటల్లో ప్రజా సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్తో కలిసి విలేకరులతో మా ట్లాడారు.
బీజేపీ అధికారంలోకి వచ్చినాటి నుంచి దేశంలో ఎక్కడా ఒక్క పరిశ్రమను కూడా స్థాపించలేదన్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలను బీజేపీ సర్కారు తన ఘనతగా ప్రచారం చేసుకోవడం విడ్డూరమన్నారు. విభజన హామీలు నెరవేర్చని ఆయనకు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే హక్కులేదని ధ్వజమెత్తారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదో? బయ్యారం ఉక్కు పరిశ్రమలను ఎందుకు ఏర్పాటు చేయలేదో? ప్రజలకు సమాధానం చెప్పి తెలంగాణకు రావాలని డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కులను హరించేలా చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డా రు. రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తుందన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలను కూలగొట్టేందుకే దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నదని విమర్శించారు. మంత్రి విదేశాల్లో ఉన్న సమయంలో ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేయడం సరికాదన్నారు. ప్రధాని పర్యటను నిరసిస్తూ 11న (శుక్రవారం)నగరంలోని అంబేద్కర్ విగ్రహాం వద్ద నిరసన తెలుపుతామని వెల్లడించారు. పీజేఏసీ నాయకులు తరలివచ్చి విజయవంతం చే యాలని కోరారు. సమావేశంలో సుద్దాల లక్ష్మ ణ్, ఆనందరావు, కాల్వ ఆనంద్, కుల సంఘల జేఏసీ చైర్మన్ జీఎస్ ఆనంద్ పాల్గొన్నారు.