విద్యానగర్ జూలై 2: మతం పేరుతో విద్వేషాన్ని రగిలిస్తూ మనుషులను విభజిస్తున్న బీజేపీని తరిమికొట్టాలని ఏఐఐఈఏ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కొండ సత్యలక్ష్మి గార్డెన్స్లో శనివారం నిర్వహించిన ఐసీఈయూ కరీంనగర్ డివిజన్ 26వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మిశ్రా మాట్లాడుతూ, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనకి తీసుకొచ్చి ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేయడం వంటి హామీలతో గద్దెనెకిన మోదీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనలో దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేసిందన్నారు. ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ టు డు బిజినెస్ అనే మూర్ఖపు ఆలోచనతో సామాన్య ప్రజల, కార్మికుల సంక్షేమం గాలికి వదిలేసి కార్పొరేట్ల సేవలో తరిస్తున్నదని ధ్వజమెత్తారు.
దేశ వ్యాప్తంగా జరిగిన అనేక సార్వత్రిక సమ్మెల్లో 25 కోట్లకు పైగా ఉద్యోగులు, కార్మికులు, రైతులు పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని పోరాటం చేస్తే పట్టించుకోలేదన్నారు. కరోనా అనంతరం పరిణామాలతో వేలాది మధ్య తరహా పరిశ్రమలు మూత పడడంతో కోట్లాది మంది ఉపాధిని కోల్పోయారని, దీనికి తోడు ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకాలు లేక నిరుద్యోగం 75 సంవత్సరాల్లో అత్యధికంగా 8.5 శాతానికి చేరిందన్నారు.
ఒకవైపు సామాన్యుల జీవన ప్రమాణాలు అట్టడుగు స్థాయికి చేరితే ఇదే కాలంలో మోదీ దత్తపుత్రుడు అదానీ ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించాడని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని తిరసరించేందుకు 26వ మహాసభ నిర్ణయం తీసుకుంటుందని ఆయన అభిలాషించారు. అనంతరం సంఘం జాతీయ అధ్యక్షుడు వీ రమేశ్ మాట్లాడుతూ, పరమత సహనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దేశ ఔన్నత్యాన్ని మోదీ ప్రభుత్వం పాతాళానికి తొకి వేసిందన్నారు. కులం, మతం పేరిట భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజలను విడదీస్తున్నదని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఒక మతానికి, ఒక పార్టీకి అనుకూలంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. సెక్యులరిజానికి ప్రధాని సమాధి కడుతూ పాలన సాగిస్తున్న తీరు అనేక అనుమానాలకు దారితీస్తున్నదని వ్యాఖ్యానించారు. ఆర్మీలో రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులను అగ్నిపథ్తో కేంద్రం ఊహించని రీతిలో దెబ్బతీసిందన్నారు. అనంతరం జోనల్ అధ్యక్షుడు సతీశ్, ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, ఆర్థిక కార్యదర్శి శ్రీనివాసన్, సహాయ ఆర్థిక కార్యదర్శి రాజేశ్సింగ్ మాట్లాడారు. సంఘం డివిజనల్ అధ్యక్షుడు వీ రాజేందర్ ఉద్యోగ విరమణ పొందగా శాలువాలతో సతరించారు. ఆయన చూపిన దారిలో పయనిస్తామని నాయకులు, సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.
కార్యవర్గం ఎన్నిక
సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జీ రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శిగా ఆర్ వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా ఏ రామ్మోహన్ రావు, సంయుక్త కార్యదర్శి కార్యదర్శులుగా వీ వామన్ రావు, డీ సూర్యకళ, ఆర్థిక కార్యదర్శిగా బసవేశ్వర్ ఎన్నికయ్యారు. కరీంనగర్ డివిజన్లో ఉన్న 13 బ్రాంచీల నుంచి సుమారు 300 మంది సంఘం, నాయకులు సభ్యులు పాల్గొన్నారు.