కరీంనగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా శ్వేత విప్లవాన్ని సృష్టించి పాడి రైతులకు అండగా నిలబడడంలో కీలక భూమిక పోషించిన కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్రావును డాక్టరేట్ వరించింది. నష్టాల్లో ఉన్న కరీంనగర్ డెయిరీని ప్రస్తుతం తెలంగాణలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దడమే కాకుండా.. పాడి పరిశ్రమకు కొత్త బాటను చూపించిన ఆయన సేవలకు గుర్తింపుగా మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ ప్రకటించింది.
ఈ మేరకు కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీ శంకర్రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. డాక్టరేట్ను ఈ నెల 19న న్యూ ఢిల్లీలోని ఇండియా హ్యాబి టాబ్ సెంటర్లో గల హుల్మోహర్లో జరిగే కార్యక్రమంలో రాజేశ్వర్రావు అందుకోనున్నట్లు తెలిపారు. వ్యవసాయ పట్టభద్రులైన సీహెచ్ రాజేశ్వర్రావు పాడి పరిశ్రమ రంగం, రైతుల సాధికారత దిశగా అవిశ్రాంత కృషి చేశారు. పాడి పరిశ్రమను అదనపు ఆదాయ వనరుగా చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారు.
రాజేశ్వర్రావు నాయకత్వంలో కరీంనగర్ డెయిరీ అద్భుతమైన వృద్ధిని సాధించి పాలు, పాల ఉత్పత్తుల సేకరణతోపాటు అమ్మకాల పరంగా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. మారెట్ పరిధిని విస్తరించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడేలా అయన అనేక కొత్త ఉత్పత్తుల తయారీకి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం లక్ష మందికి పైగా రైతులు కరీంనగర్ డెయిరీ పాలను సరఫరా చేస్తుండగా, ఈ ప్రాంతంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు రైతులు, పాడిపశువుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించడంలో రాజేశ్వర్రావు కీలక పాత్ర పోషించారు. 1971 సంవత్సరంలో 12 వేల లీటర్ల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ డెయిరీ నేడు తిమ్మాపూర్ మండలం నల్లగొండ-నుస్తులాపూర్ గ్రామాల మధ్య బారీ డెయిరీ (మెగా డెయిరీ) కేంద్రంతో 3 లక్షల లీటర్లకు పైగా సామర్థ్యానికి విస్తరించడంతో రాజేశ్వర్రావు కృషి ఎంతగానో ఉంది.
రాజేశ్వర్రావు అందుకున్న అవార్డులు
రాజేశ్వర్రావు గతంలోనే ఇలాంటి పలు అవార్డులు అందుకున్నారు. 2026లో అవుటాండింగ్ డెయిరీ ప్రొఫెషినల్ అవార్డ్, 2020లో ఇండియా డెయిరీ అవార్డు, 2019లో డెయిరీ రంగంలో ఉత్తమ రిటైలర్గా దీ హన్స్ ఇండియా అవార్డు, 2017లో ఉత్తమ పారిశ్రామికవేత్తగా కరీంనగర్ లయన్స్ క్లబ్ అవార్డు, 2014లో ఉత్తమ సామాజిక సేవకు ఒంగోలులోని ఆచార్య ఎన్జీ రంగా కిసాన్ సంస్థ అవార్డు, 2016లో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఉత్తమ రైతు అవార్డు, 2010లో ఉత్తమ సేవల విభాగంలో డాక్టర్ సీ కృష్ణారావు అవార్డు అందుకున్నారు.