తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 3 : గ్రామీణ ప్రాంత విద్యార్థుల కలలను జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల సాకారం చేస్తున్నదని జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ కట్టా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జ్యోతిష్మతి కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ‘ఉత్సవ్ -22’ పేరుతో శనివారం రాత్రి కళాశాల ఆవరణలో వైభవంగా జరుగగా, వీసీ ముఖ్యఅతిథిగా, గౌరవ అతిథిగా హైదరాబాద్ ఐఐటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉదయ్ బీ దేశాయి హాజరయ్యారు. కళాశాలలో ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు. జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించి, మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంత గొప్ప కళాశాలను స్థాపించి, విద్యార్థులకు నాణ్యమైన చదువును అందిస్తున్న కళాశాల యాజమాన్యాన్ని వీసీ అభినందించారు.
త్వరలోనే జ్యోతిష్మతి కళాశాల అటనామస్ సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు మేజర్ డిగ్రీతో పాటు, మైనర్ డిగ్రీని పూర్తిచేసి ఒకే అకాడమిక్ ఇయర్లో రెండు డిగ్రీలు పొందవచ్చని తెలిపారు. రీసెర్చ్ సెంటర్ను జ్యోతిష్మతి కళాశాలకు కేటాయిస్తామని, ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఐఐటీ మాజీ డైరెక్టర్ ఉదయ్ మాట్లాడుతూ, రీసెర్చ్లో విద్యార్థులు, అధ్యాపకులు ముందంజలో ఉండాలని సూచించారు.
చైర్మన్ జువ్వాడి సాగర్రావు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలోని టాప్ కాలేజీల్లో జ్యోతిష్మతి ఒకటిగా నిలుస్తున్నదని చెప్పారు. రజతోత్సవాల్లో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. అనంతరం యాజమాన్యం అతిథులను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించింది. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకున్నది. కార్యక్రమంలో సెక్రటరీ సుమిత్ సాయి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జువ్వాడి అమిత్, ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీనివాస్, డాక్టర్ పీ కే వైశాలి, డాక్టర్ షణ్ముగకుమార్, ప్రొఫెసర్ బాబూరావు, ప్రొఫెసర్ బుగ్గారావు, పూర్వ విద్యార్థి ఏకాంబరేశ్వర స్వామి, ఆయా విభాగాల హెచ్వోడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.