జగిత్యాల : సర్దార్ సర్వాయి పాపన్న సబ్బండ వర్ణాల సంక్షేమానికి పోరాడిన వ్యక్తని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ( Sardar Sarvai Papanna Goud ) జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో పాపన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడని కొనియాడారు. సర్వాయి పాపన్న జయంతి ని అధికారికంగా నిర్వహించాలని 30 సంవత్సరాలుగా బహుజనులు పోరాడరని తెలిపారు. సమైక్య పాలనలో పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నాటి పాలకులకు మనసు రాలేదని విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ (CM KCR) పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. నేటి తరం పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను కొనసాగించాలని సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.