జగిత్యాల, డిసెంబర్ 16, (నమస్తే తెలంగాణ): ‘ప్రతిపక్షాలు ప్రగతి నిరోధకులు.. అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్నారు..ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు..’ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణితో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. వీధి వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని సూచించారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి రెచ్చగొట్టేవిధంగా మాట్లాడం తప్పా, అభివృద్ధి చేతగాదని నిప్పులు చెరిగారు. సిరిసిల్ల, కరీంనగర్లో మాదిరిగా రోడ్లను వెడల్పు చేసి వీధి వ్యాపారుల ఇబ్బందులను తొలగించారని, అదే తరహాలో జగిత్యాలలో నిర్మాణాలు చేపడుతుంటే రెచ్చగొట్టడం ఆయన దిగుజారుడు తనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం వారిని బలిచేయడం భావ్యంకాదని ఆక్షేపించారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి అనాలోచితంగా వ్యవహరించడం సరికాదన్నారు. వీధి వ్యాపారులకు సంబంధించిన సమగ్ర సమాచారం తమ వద్ద ఉందన్నారు. ప్రభుత్వమే వీధి వ్యాపారులకు షటర్లు నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడ ధర్నాలు చేసే బీజేపీ నేతలు జిల్లాకు నవోదయ పాఠశాల గాని, మెడికల్ కళాశాల గాని తీసుకురావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో జగిత్యాల మున్సిపాలిటీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందేనన్నారు. నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాలని ప్రజలను కోరారు. అనంతరం ఎమ్మెల్యే వీధి వ్యాపారులతో మాట్లాడి అండగా ఉంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ మోసిన్, కౌన్సిలర్లు చుక నవీన్, అల్లె గంగసాగర్, కప్పల శ్రీకాంత్, క్యాదాసు నవీన్, కో ఆప్షన్ సభ్యుడు రియాజ్ మామ, నేతలు ముఖేశ్ కన్నా, అలిశెట్టి వేణు, మతిన్, కూతురు శేఖర్ ఉన్నారు.