ఉమ్మడి జిల్లాను నాలుగు రోజులుగా వాన వదలడం లేదు. ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్నది. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించి పోయింది. శుక్రవారం రామడుగు మండలం గుండి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 213.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని చెరువులు, చెక్డ్యాంలు అలుగులు పారుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. వరద నీరు ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతున్నది. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్లు ఎప్పటికప్పుడూ వర్షం సమాచారం తెలుసుకుంటూనే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేస్తుండడంతో వారు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాల వారీగా టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు.
కరీంనగర్, జూలై 21(నమస్తే తెలంగాణ): నాలుగు రోజులుగా వాన గెరువియ్యడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతుండగా, పలు చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. శుక్రవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండిలో రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఈ గ్రామంలో 213.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మూలవాగు, మానేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అమాత్యులు రంగంలోకి దిగారు. ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లతో మాట్లాడారు. ధర్మపురి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.
ప్రాజెక్టులకు జలకళ
నర్మాలలోని ఎగువ మానేరులోకి కూడవెల్లి, పాల్వంచ వాగుల నుంచి 2100 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తున్నది. ఈ ప్రాజెక్టులో 31 అడుగుల సామర్థ్యానికి గానూ 28 అడుగులకు చేరింది. దిగువన మానేరులోని చెక్డ్యాంలు నిండడంతో వాగు ప్రవాహ ఉధృతి పెరుగగా, వేములవాడ మూల వాగు నుంచి ఎస్సారార్లోకి 3500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఈ జలాశయం నుంచి 9100 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న ఎల్ఎండీకి వదిలారు. రాత్రి నుంచి 4592 క్యూసెక్కుల నీటిని 4 గేట్ల ద్వారా దిగువ మానేరుకు వదులుతున్నారు. తిమ్మాపూర్, చిగురుమామిడి తదితర మండలాల్లో కురిసిన వర్షం కారణంగా మోయతుమ్మెద వాగు నుంచి ఉదయం 6 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎల్ఎండీలోకి వచ్చింది. సాయంత్రం వరకు 4 వేల క్యూసెక్కులు రాగా, మానేరు నుంచి 9100 క్యూసెక్కులు వచ్చింది. రాత్రి వరకు మొత్తం ఎల్ఎండీలోకి 8024 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. రాత్రి 8 గంటల వరకు గోదావరి ద్వారా ఎల్లంపల్లికి 2,46,037 క్యూసెక్కుల వరద పోటెత్తడంతో అక్కడ 25గేట్లను ఎత్తి 2,53,650 క్యూసెక్కుల నీటిని దిగువన గల పార్వతీ బ్యారేజీలోకి వదులుతున్నారు. దిగువన మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బ్యారేజీకి అదే స్థాయిలో వరద వస్తుండడంతో ఇక్కడ 60 గేట్లను ఎత్తి సరస్వతీ బ్యారేజీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మంథని మండలం ఆరెంద వద్ద సరస్వతీ బ్యారేజీలోకి మానేరు, బొక్కలవాగు నుంచి వచ్చే ఇన్ఫ్లోతో వరద ప్రభావం తీవ్రంగా పెరుగుతున్నది.
అధికారయంత్రాంగం అప్రమత్తం
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల వారీగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర ఉన్నతస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, పరిస్థితిని తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాగులు, లోలెవల్ వంతెనల వద్ద బారికేడ్లు, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే చెరువులు, జలాశయాల వద్దకు వెళ్లద్దని సూచిస్తున్నారు. కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం ఉదయం ఎల్ఎండీ జలాశయాన్ని సందర్శించి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఇన్ఫ్లో భారీగా పెరిగితే గేట్లు ఎత్తడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరికి వరద వస్తుండగా, నదీ తీరం వెంట పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అలర్ట్గా ఉండాలని సూచించారు. ఎల్లంపల్లి నుంచి నీటి విడుదల నేపథ్యంలో అధికారులు గోదావరి తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మంథని, రామగుండం నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బ్యారేజీ, గుంజపడుగులోని సరస్వతీ పంపుహౌస్తోపాటు మంథనిలోని బొక్కలవాగును పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. వేములవాడలోని 13వ వార్డు బుడుగ జంగాల కాలనీలోకి వరద నీరు చేరడంతో 42 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. . రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పార్వతీ పంప్హౌస్, పార్వతీ బ్యారేజీ, ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించి, ఎగువనుంచి వస్తున్న వరదకు అనుగుణంగా గేట్లు ఎత్తేలా అధికారులకు పలు సూచనలు చేశారు.
కరీంనగర్ 18004254731
జగిత్యాల 08724-222557
పెద్దపల్లి 7995070699
సిరిసిల్ల 9398684240