హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 24: క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. హుజూరాబాద్ క్లబ్లో శనివారం నిర్వహించిన అంతర్ జిల్లా స్థాయి షటిల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంచడంతోపాటు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, క్రీడా పోటీల్లో ప్రతి ఒకరూ గెలుపోటములను సమానంగా తీసుకొని క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు. హుజూరాబాద్ క్లబ్లో నిర్వహిస్తున్న షటిల్ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 58 జట్ల క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలు శనివారం ప్రారంభం కాగా ఆదివారం రోజు ఫైనల్స్ పోటీలు ఉంటాయన్నారు. ఫైనల్స్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు తుమ్మల శ్రీరామ్ రెడ్డి, కార్యదర్శి పీవీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కంకణాల తిరుపతిరెడ్డి, సంయుక్త కార్యదర్శులు వీరసేనారెడ్డి, చొల్లేటి కిషన్రెడ్డి, సభ్యులు నారాయణరెడ్డి, వేణుగోపాల్, మేనేజర్ మహ్మద్ జబ్బార్ పాల్గొన్నారు.