కార్పొరేషన్, మే 28 : కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్తగా నల్లా కనెక్షన్ తీసుకోవాలన్నా.. ఉన్న కనెక్షన్ పేరు మార్పిడి చేసుకోవాలన్నా అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. నల్లా కనెక్షన్లు మంజూరు చేసే విషయంలో ఇంజినీరింగ్ అధికారులు ఇష్టారీతిగా పెడుతున్న నిబంధనలతో నగరవాసులు బేజారవుతున్నారు. ఉన్నతాధికారులు మారినప్పుడల్లా సరికొత్త నిబంధనలు తీసుకువచ్చి దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో నల్లా కనెక్షన్ మంజూరుకు నెలల తరబడి సమయం పడుతున్నది. దీనికి తోడు తమ దరఖాస్తులపై కార్యాలయంలో విచారణకు వచ్చే ప్రజలు సరైన సమాధానం ఇచ్చే అధికారులు, సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నల్లా కనెక్షన్ పేరు మార్పిడి చేసుకోవాలంటే ముప్పు తిప్పలు పడాల్సి వస్తున్నది. గతంలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నగరపాలక రెవెన్యూ విభాగం ఇచ్చిన మ్యుటేషన్ పత్రం ఉంటే వెంటనే నల్లా కనెక్షన్లో కూడా పేరు మార్చేవారు. కానీ, కొత్తగా వచ్చిన ఇంజినీరింగ్ అధికారులు ఎక్కడా లేని నిబంధనలను తీసుకువచ్చారు. నగరపాలక సంస్థలోని రెవెన్యూ విభాగం ఇంటి మ్యుటేషన్ చేస్తూ పత్రం జారీ చేయగా అందులో ఉండే నల్లా కనెక్షన్ పేరు మార్చేందుకు ఇంజినీరింగ్ అధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారు. ఆస్తి పన్నుల్లో పేరు మార్పిడి (మ్యుటేషన్) జరిగినా మరోసారి ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తప్ప నల్లా కనెక్షన్ మార్చేది లేదని తెలుస్తోంది. మ్యుటేషన్లో ఇబ్బందులు తొలగించాలని రిజిస్ట్రేషన్ సమయంలోనే మున్సిపాలిటీల్లో మ్యుటేషన్ అయ్యే విధానాన్ని బీఆర్ఎస్ హయాంలో అమలు చేశారు. కానీ, కరీంనగర్ బల్దియాలో మాత్రం ఇంటి పేరు మార్పిడి పత్రం (మ్యుటేషన్)అయినా నల్లా పేరు మార్పిడికి విచారణ పేరుతో అధికారులు ఆలస్యం చేస్తున్నారు. దీనికి బల్దియాలో దరఖాస్తు చేసిన తర్వాత లైన్మెన్, ఏఈఈలు క్షేత్రస్థాయిలో పరిశీలించి తర్వాత నోటి ఫైల్ కోసం డీఈ, ఈఈ సంతకాతు చేయాల్సి వస్తున్నది. క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులు నెలల తరబడిగా సమయం తీసుకుంటుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రత్యేకాధికారి దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
నగరపాలక సంస్థలో సాధారణంగా నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేస్తే సంబంధింత లైన్మెన్, ఏఈలు క్షేత్రస్థాయిలో పరిశీలించి మంజూరుకు అప్రువల్ ఇస్తూ నోట్ ఫైల్ చేస్తే దీనిపై డీఈ, ఈఈలు తగు చర్యలు చేపడుతారు. కానీ, కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులు మారితే చాలు కొత్త నిబంధనలు అమలు చేస్తుండడంతో ప్రజల్లో గందరగోళం నెలకుంటున్నది. నల్లా కనెక్షన్ మంజారీకి, పేరు మార్పిడికి గ్రేటర్ హైదరాబాద్ నిబంధనలు అమలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ. ఏ నిర్ణయమైనా అక్కడి వరకే పరిమితం అవుతుంది. అదే విధానం మిగిలిన మున్సిపాలిటీలకు అమలు చేస్తుండడంతో దరఖాస్తులు పెండింగ్లో పడుతున్నాయి. దీంతో ప్రజలు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పటికే నగరపాలక సంస్థ కొత్త నల్లాల కోసం 180 మేరకు ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని నీటి నిర్వహణ విభాగం సిబ్బందే చెబుతున్నారు. ముఖ్యంగా ఏఈఈలు క్షేత్రస్థాయిలో పరిశీలన పేరుతో పెండింగ్లో పెడుతున్నారని తెలుస్తోంది. దీనికి తోడుగా కొత్త నిబంధనలు కూడా ఇబ్బందిగా మారుతున్నయి.