జగిత్యాల : మెట్పల్లి అర్బన్ కాలనీలో నిర్మాణ దశలో ఉన్న హెల్త్ సెంటర్ ( Health Centres ) తో పాటు కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట వద్ద నిర్మిస్తున్న హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ( Collector B. Satyaprasad ) గురువారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూహెల్త్ సెంటర్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణంతో పాటు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ప్రహరీ, రహదారి వంటి సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అనంతరం మెట్పల్లి పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.
అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు తప్పనిసరిగా నమోదు అయ్యేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెట్పల్లి , కోరుట్ల ఆర్డీవోలు నరసింహారావు, జీవాకర్ రెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) సుజాత, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు , తదితరులు పాల్గొన్నారు.