Kolanuru | ఓదెల, సెప్టెంబర్ 12 : స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అనేదానికి 40 సంవత్సరాల తర్వాత స్నేహితుడి కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్లో 1987లో పదో తరగతి చదివిన ఎస్ఎస్సీ బ్యాచ్ మిత్రులు తన చిన్ననాటి స్నేహితుడు కుటుంబం ఆపదలో ఉందని తెలుసుకుని ఆదివారం ఆ కుటుంబానికి సాయం అందజేశారు. పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కారోబార్ మామిడి కొమురయ్య పది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవల మృతి చెందాడు.
గతంలో అతని భార్య పద్మ రెండు పర్యాయాలు సర్పంచ్గా పదవి చేపట్టి క్యాన్సర్ తో మృతి చెందింది. ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరికీ ఆసుపత్రి ఖర్చులకు చాలా డబ్బులు పెట్టారు. ఈ విషయం తెలిసిన చిన్ననాటి క్లాస్మేట్స్ మిత్రులు ఆదివారం వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి రూ.26,500 అందజేశారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత తమ మిత్రుడు కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుసుకొని సాయం అందించడం పట్ల స్నేహానికి ఉన్న గొప్పతనాన్ని మరోమారు చాటి చెప్పారని పలువురు వారిని అభినందించారు. ఇది సమాజంలో పలువురికి ఆదర్శంగా నిలువనున్నదని కొనియాడారు.