పెద్దపల్లిరూరల్, మార్చి 27: ‘కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పినవన్నీ అబద్ధాలే. అంతా మోసమే. దొంగ హామీలతో రైతులను ముంచి గద్దెనెక్కింది. సాగునీటి నిర్వహణలో ఘోరంగా విఫలమై, పంటలు ఎండబెడుతూ రైతన్న పొట్టకొడుతున్నది’ అని పెద్దపల్లి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సాగునీరందక ఎండిన పంటలకు గాను ఎకరానికి 25 వేలు చెల్లించి ఆదుకోవాలని, అదే డిమాండ్తో ఈ నెల 30, 31వ తేదీల్లో జిల్లా కేంద్రాల్లో రైతు దీక్షను చేస్తున్నామని వెల్లడించారు. పెద్దపల్లి మం డలం భోజన్నపేట, చీకురాయి గ్రామాల శివారులో బుధవారం సాగునీరందక ఎండిన పొలాలలను మాజీ ఎమ్మెల్యే దా సరి మనోహర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్తో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఏనా డూ సాగునీటి కష్టాలు రానివ్వలేదని, ఎక్కడా ఒక్క ఎకరం ఎండిపోకుండా నీ రందించారని కొనియాడారు. ఎక్కడ చూ సినా పంటలు బాగా పండాయని, సాగు బంగారమైందని చెప్పారు. కానీ, కాంగ్రెస్ మూడు నెలల పాలనలో ముప్పుతిప్పలు తెచ్చిపెట్టిందని మండిపడ్డారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డికి యాసంగి పంటలకు నీరందించే సోయి లేదని విమర్శించారు. నష్టపోయిన రైతులు మనోధైర్యం కోల్పోవద్దని, మొదటి నుంచి అండగా ఉన్న బీఆర్ఎస్ను ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, డైరెక్టర్లు మేకల కుమార్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జీ రఘువీర్సింగ్, ఆవుల రాజకిషన్ యాదవ్, తీగల సదయ్య, ధర్మపురి, ఉప్పు రాజ్కుమార్ ఉన్నారు.