Korutla |కోరుట్ల, సెప్టెంబర్ 19 : గణేష్ నిమజ్జన వేడుకలను కోరుట్లలో ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ పెద్ద వాగు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని వారు అధికారులను ఆదేశించారు. ఈ నెల 23, 24 తేదీల్లో కోరుట్లలో వినాయక నిమజ్జన వేడుకలను నిర్వహించాలని తెలిపారు.
నిమజ్జనానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం వాగు పరిసరాలలో బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, అవసరమైన క్రేన్లను, నిమజ్జనం సమయంలో రద్దీ నియంత్రణ, ప్రజల భద్రత వంటి అంశాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో శానిటేషన్, హైమాస్ లైటింగ్, మంచినీటి సౌకర్యం, ఏర్పాట్లు ఉండేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్, నీటిపారుదల, విద్యుత్, అగ్నిమాపక, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి అవాంచనీయ ఘటనలకు తావులేకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహల తరలింపులో విద్యుత్ షాక్ వంటి ప్రమాదాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, గణేష్ నిమజ్జనం రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలని, నిమజ్జనం రూట్లో అవసరమైన రోడ్డు మరమ్మతుల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహశీల్దార్ కృష్ణ చైతన్య, సీఐ లక్ష్మీనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.