కరీంనగర్ రూరల్, డిసెంబర్ 16: కరీంనగర్ సమీపంలోని గన్నీ సంచుల గోదాంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ సమీపంలో బొమ్మకల్ బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద చకిలం చంద్రప్రకాశ్ గోదాంలో గన్నీ సంచుల వ్యాపారి చాడ సందీప్ గన్నీ సంచులు నిల్వ చేశాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున గోదాంలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. గుర్తించిన స్థానికులు చాడ సందీప్తోపాటు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.
మూడు ఫైరింజన్లతోపాటు వాటర్ ట్యాంకర్లలో నీటిని తీసుకువచ్చారు. శుక్రవారం మధ్యాహ్నమైనా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో చివరకు జేసీబీలతో గోదాంను కూల్చి మంటలు అదుపులోకి తేవాల్సిన పరిస్థితి వచ్చింది. గన్నీ బ్యాగులన్నీ కాలిబూడిదయ్యాయి. గోదాంలో సుమారు 40 వేల గన్నీ బ్యాగులు ఉన్నాయని, వాటి విలువ దాదాపు రూ.12.50లక్షల దాకా ఉంటుందని యజమానులు చెబుతున్నారు. కాగా, మంట లు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఎంత నష్టం జరిగిందనేది అంచనా వేయగలుగుతామని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.