Huzurabad | హుజురాబాద్ రూరల్, ఆగస్టు 25 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ఇందుకోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని అన్నారు. వనం మహోత్సవంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లి గ్రామ శివారులో కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారి పక్కన మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని సూచించారు.
రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న పచ్చదనం నేపథ్యంలో మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా అత్యంత ముఖ్యమని ఆమె చెప్పారు. రహదారుల వెంట పెద్ద ఎత్తున మొక్కలు పెంచితే పర్యావరణ సమతుల్యతతో పాటు ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములైతే హుజురాబాద్ ప్రాంతంలో పచ్చదనం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, మేనేజర్ భూపాల్ రెడ్డి, ఎస్సై కిరణ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.