విద్యానగర్ : జిల్లాలో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గురువారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గాంధీరోడ్లోని వైశ్యభవన్లో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 58 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని, వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు. ప్రజలందరికీ సులభతరంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు డివిజన్ల వారీగా వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ, కొత్తపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధుల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. వ్యాక్సినేషన్ తీసుకుని కొవిడ్ లేని జిల్లాగా మార్చాలని జిల్లా ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ గరిమా అగర్వాల్, డీఎంహెచ్ఓ డాక్టర్ జువేరియా, కార్పొరేటర్ పిట్టల వినోద తదితరులు పాల్గొన్నారు.