ధర్మపురి, మే 17: నాలుగేళ్ల కక్ష నిండు ప్రాణాలు తీసింది. ఇంటి స్థల విక్రయంలో తలెత్తిన వివాదం.. చివరకు ఇద్దరు సోదరులను బలితీసుకున్నది. తను కొంటానని అనుకున్న స్థలం దక్కలేదన్న కోపంతో రగిలిపోతున్న ఓ వ్యక్తి, అదును చూసి స్నేహితులతో కలిసి దాడి చేయడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. అడ్డుగా వచ్చిన మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి దవాఖానలో చనిపోవడం కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో గోపులాపూర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. బుగ్గారం ఎస్ఐ శ్రీధర్రెడ్డి వివరాల ప్రకారం.. గోపులాపూర్కు చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం తన ఇంటి స్థలాన్ని అదే ఊరికి చెందిన బుర్ర నవీన్కు అమ్ముతానని మాటిచ్చాడు. అయితే ఆయనకు కాకుండా గ్రామానికి చెందిన దీటి శ్రీనివాస్(38)కు 70 వేలకు విక్రయించాడు. అయితే తనకు స్థలం దక్కలేదన్న కారణంతో అప్పటి నుంచి శ్రీనివాస్పై నవీన్ కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పలుసార్లు గొడవలు జరిగాయి. ఏళ్లు గడుస్తున్నా నవీన్ కోపం చల్లారలేదు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి శ్రీనివాస్ వరుసకు తమ్ముడైన దీటి మహేశ్ (36) ఇంటికి వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న బుర్ర నవీన్ అటుగా వెళ్తూ శ్రీనివాస్ను గమనించాడు. కొందరు స్నేహితులను వెంటబెట్టుకొని వచ్చి కర్రలతో దాడికి దిగారు. అడ్డుకునేందుకు వెళ్లిన మహేశ్ను సైతం చితకబాదారు. ఈ దాడిలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేని మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. వరంగల్ దవాఖానకు తరలించగా, అక్కడ పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మృతి చెందాడు. హత్య జరిగిన స్థలాన్ని అదనపు ఎస్పీ వినోద్కుమార్ పరిశీలించారు. శ్రీనివాస్ సోదరి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్కు భార్య, మహేశ్కు భార్య, కొడుకు ఉన్నారు.