Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 24 : రామగుండం నగర పాలక సంస్థ 51వ డివిజన్ పరిధి లక్ష్మీనగర్ లో మళ్లీ కూల్చివేతలు స్థానికులను హడలెత్తించాయి. ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో వ్యాపారులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా, టౌన్ ప్లానింగ్ అధికారులు చేరుకొని రోడ్డు వెడల్పు పేరుతో షాపులను జేసీబీతో కూల్చివేయడం ఆందోళన కలిగించాయి. డాక్టర్ క్యాస శ్రీనివాస్ హాస్పిటల్ నుంచి గణేష్ నగర్ బోర్డు వరకు గల వీధిలో సోమవారం కూల్చివేతలు జరిగాయి. డివిజన్ కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేష్ ఘటనా స్థలంకు చేరుకొని మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదంకు దిగారు. కార్పొరేటర్ తనకు ఒక్కమాట చెప్పకుండా ఏకపక్షంగా వచ్చి ఆస్తుల విధ్వంసంకు పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయమై కమిషనర్ అరుణశ్రీని ఫోన్ ద్వారా సంప్రదించగా స్పందించలేదని పేర్కొన్నారు.
దుకాణాల కూల్చివేతలకు వచ్చిన అధికారులను అడిగితే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని తెలిపారు. కాగా, ఏడాదిన్నర క్రితమే దాదాపు 30 ఫీట్ల రోడ్డు వెడల్పు పేరుతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేయగా, స్థానికులు స్వచ్ఛందంగా షాపులు, గృహాలను మార్కింగ్ వరకు తొలగించుకున్నారు. ఆ తర్వాత రోడ్డు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. తీరా మళ్లీ మున్సిపల్ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ అధికారుల విధులకు అభ్యంతరం చెప్పడం లేదనీ, కానీ ప్రజల ఆస్తుల ధ్వంసంకు పాల్పడే ముందు కార్పొరేటర్ కు కనీస సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. గతంలోనే స్వచ్ఛందంగా తొలగించుకొని నిర్మాణాల కోసం రూ.లక్షలు నష్టపోయారనీ, మళ్లీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే రోడ్డు అభివృద్ధి పనులు కూడా వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.