కరీంనగర్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నేషనల్ ఫెడరేషన్ ఆఫ్సెట్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ లిమిడెట్ (ఎన్ఏఎఫ్ఎస్సీవోబీ) చైర్మన్ కొండూరి రవీందర్రావు అధ్యక్షతన గురువారం బెంగళూర్లో దక్షిణాది రాష్ర్టాల సహకార బ్యాంకు ల సదస్సు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్ర సహకార శాఖ మంత్రి రాజన్న సహకారంతో జరగ్గా.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా వెలుగు వెలిగిన సహకార రంగానికి, రానున్న కాలంలో పూర్వవైభవం కల్పించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించారు. అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా వ్యవసాయరంగానికి వెన్నుదన్నుగా నిలువాలని, భవిష్యత్లో 50 శాతం వరకు రుణాలు అందించేందుకు ప్రయత్నాలు జరగాలని, 2047 నాటికి సహకార రంగంలోని బ్యాంకులు దేశ జీడీపీలో కీలక పాత్ర పోషించాలని, అందుకు ఇప్పటినుంచే కార్యాచరణ ఉండాలన్న అంశంపై చర్చించారు.
ఈ వివరాలను రవీందర్రావు వెల్లడించారు. ఇంకా జిల్లాల్లో సహకార బ్యాంకుల సేవలను విస్తరించడంతోపాటు వ్యవసాయంతోపాటు ఇతర వాణిజ్య కార్యకలాపాలకు రుణాలు మంజూరు చేసి అన్ని వర్గాలకు అండగా నిలువడం, బ్యాంకు మనుగడతోపాటు అభివృద్ధి కోసం కావాల్సిన డిపాజిట్ల సేకరణపై దృష్టిపెట్టడం, సహకార సంఘాల ద్వారా వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తూ ఆయా వర్గాల మన్ననలను పొందడం, అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించిన కరెంటు ఖాతాలతోపాటు స్థానిక సంస్థలు, దేవాదాయ శాఖ ఖాతాలను సహకార బ్యాంకు శాఖల్లో ఖాతాలను తెరిచేందుకు ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నాప్స్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యంతోపాటు దక్షిణాది రాష్ర్టాల సహకార బ్యాంకుల అధ్యక్షులు, మేనేజింగ్ డైరెక్టర్లు, జిల్లా బ్యాంకుల అధ్యక్షులు, ముఖ్య కార్య నిర్వహణాధికారులు, కర్ణాటక రాష్ట్ర బాంకు అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.