కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 16 : ఈ చిత్రంలో గూడ్స్ వ్యాన్ పక్కన ఉన్న ఇతని పేరు గడ్డం శ్రీనివాస్. ఊరు కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్పేట. ఇతనిది నిరుపేద దళిత కుటుంబం. భార్య హైమావతి, కూతురు జమున, కొడుకు రాజ్కుమార్ ఉన్నారు. తన కులవృత్తి అయిన చిందు యక్షగానాన్నే నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునేది. రాష్ట్ర సాధనలో శ్రీనివాస్ తన యక్షగానం ద్వారా పలు గ్రామాల్లో ప్రదర్శనలు ఇచ్చేది. తన ఆడ వేషం ద్వారా యక్షగానాలు చెప్పి జనాన్ని మెప్పుపొందేది.
యక్షగానం లేని సమయంలో కూలీ పనులు చేసుకునేది. అయితే కాలక్రమేణా యక్షగానం మరుగున పడడంతో బతుకు భారమైంది. కూలి పనికి వెళ్తున్నా పూటకే తప్ప రూపాయి వెనకపడక పోయేది. కానీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన దళిత బంధు శ్రీనివాస్కు బతుకుచూపింది. యూనిట్ కింద గూడ్స్ వ్యాన్ కొనుక్కున్నాడు. కాగా, గూడ్స్ వ్యాన్కు మార్కెట్లో డిమాండ్ ఉండడం, సామగ్రి తరలింపునకు రోజూ ఆర్డర్లు వస్తుండడంతో రోజంతా పనిదొరుకుతున్నది. అన్నీ పోను నెలకు రూ.30వేల దాకా సంపాదిస్తున్నాడు. నాడు ఎవరైనా యక్షగానానికి పిలిస్తే పొట్ట గడిచేదని, నేడు సీఎం కేసీఆర్ దయతో గూడ్స్ వ్యాన్కు ఓనర్ అయ్యానని శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశాడు.