RTP E-Challan | శంకరపట్నం, సెప్టెంబర్ 15 : ఈ-చలాన్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ‘ఈ-చలాన్’ జీవితకాలం పాటు పూర్తిగా ఉచితం. ఇప్పుడే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. ఆలస్యం చేయకండి..’ అంటూ వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలతోపాటు ఏపీకే ఫైళ్లను పంపిస్తున్నారు. ఈ సందేశాలను చూసి వాహనదారులు ఆందోళనకు గురై ఏపీకే ఫైల్ను మొబైల్లో ఇన్స్టాల్ చేస్తే వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరే ప్రమాదం ఉంది.
అప్రమత్తతే రక్షణ
ఈ-చలాన్ ఉందో లేదో తెలుసుకోవడానికి గుర్తుతెలియని లింకులు, ఏపీకే ఫైళ్లను ఉపయోగించకుండా అధికారిక ఈ-చలాన్ వెబ్సైట్ ద్వారానే వివరాలు పరిశీలించాలి. అనుమానాస్పద యాప్లను ఇన్స్టాల్ చేయకూడదు. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు. ఇప్పటికే ఇలాంటి ఏపీకే ఫైల్ను ఇన్స్టాల్ చేసి ఉంటే వెంటనే తొలగించి, అనుమానాస్పద లావాదేవీలు ఉంటే 1930కు సమాచారం ఇవ్వాలి.