Chigurumamidi | చిగురుమామిడి సెప్టెంబర్ 19 : చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నో బ్యాగ్ డే కార్యక్రమంలో భాగంగా మోడల్ ఎలక్షన్స్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల విధానం, ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియను ఆచరణాత్మకంగా పరిచయం చేశారు. అభ్యర్థుల ఎంపిక, ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు తదితర అంశాలను విద్యార్థులు స్వయంగా పాల్గొని తెలుసుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ మోడల్ ఎలక్షన్ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీ లక్ష్మణరావు మార్గదర్శకత్వం వహించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లదండ్రులు ఉత్సాహంగా పాల్గొని ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్ రమాదేవి, సీహెచ్. జోష్న, షర్మిల, శంకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.