రాయికల్, ఫిబ్రవరి 5: సర్కారు బడుల స్వరూపాన్ని మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. ఇందులో భాగంగా మొదటి విడుతలో రాయికల్ పట్టణం, మండలం నుంచి 18 స్కూళ్లను ఎంపిక చేయగా ఇందులో కుమ్మరిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఒకటి. ఈ స్కూల్లో చదువుకుంటున్న 109 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని తలంచి ప్రభుత్వం రూ. 18 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో 12 రకాల పనులు చేపట్టింది. రూ.3.5 లక్షలతో ప్రహరీ నిర్మించారు. రూ3.6 లక్షలతో ఆధునాతన మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. రూ.11.27 లక్షలతో తాగునీటి సౌకర్యం కల్పించారు. రూ.2.56 లక్షలతో విద్యుదీకరణ పనులు చేపట్టారు. రూ.6.25 లక్షలు వెచ్చించి ఇతర మరమ్మతు పనులు, భవనాలు, క్లాస్రూంలలో పెయింటింగ్ వేయించారు. పాఠశాలల్లో ఆరుబయట గోడలు, ప్రహరీకి నీలం, తెలుపు వేయగా తరగతి గదుల్లోని గోడలకు ఓకే రంగును ఉపయోగించారు. కిటికీలు, ఇనుప గ్రిల్స్ , గేటు, మూత్రశాలలకు సైతం కలర్స్ వేశారు. తరగతి గదుల్లో గ్రీన్ బోర్డులు, 40 డ్యూయల్ డెస్క్లు అమర్చారు. ఇలా అధునాతన హంగులు కల్పించిన పాఠశాలను ఇటీవలే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు.
ఆహ్లాదకర వాతావరణం..
కుమ్మరిపల్లి స్కూల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తేవడంతో ఆహ్లాదకర వాతారణం నెలకొన్నది. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకునేలా తరగతి గదులను తీర్చిదిద్దారు. మంచి లైటింగ్ ఏర్పాటు చేశారు. విశాలమైన మైదానాన్ని చదునుచేసి ఆటలు ఆడుకునేలా రూపొందించారు. విద్యార్థులు తిన్న తర్వాత చేతులు కడుక్కునేందుకు నల్లాలను బిగించారు. వెరసీ సకల వసతులతో ముస్తాబైన పాఠశాలను చూసి విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విద్యనందిస్తున్న సర్కారుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది..
ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి ద్వారా పాఠశాలలో అన్ని వసతులు సమకూరినయ్. ప్రభుత్వం ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం. స్కూల్ను చూసి పిల్లల తల్లిదండ్రులు సంతోషపడుతున్నరు. వచ్చే విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.
– గుట్ట సత్యనారాయణ, హెడ్మాస్టర్
బడిని అద్భుతంగా తీర్చిదిద్దారు..
మన ఊరు-మన బడి కింద మా ఊరి పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆరుబయట, తరగతి గదుల్లో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నది. దీంతో పిల్లలు చక్కగా చదువుకొనే అవకాశం కలిగింది. ఉపాధ్యాయులు సైతం చక్కగా బోధిస్తున్నారు. సౌలత్లు కల్పించిన సర్కారుకు కృతజ్ఞతలు..
– ఓల్లెపు రాజేందర్. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కుమ్మరిపల్లి