వస్త్రనగరి సిరిసిల్ల సిగలో మరో మణిహారం చేరుతున్నది. రెడీమెడ్ ప్రపంచంలో కార్మిక క్షేత్రం ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు చేపట్టిన అప్పారెల్ పార్క్ వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే టెక్స్టైల్ దిగ్గజం గోకుల్దాస్ యూనిట్ ప్రారంభమై సక్సెస్ఫుల్గా నడుస్తుండగా, ప్రముఖ టెక్స్పోర్టు ఇండస్ట్రీస్ సైతం ఉత్పత్తికి రెడీ అవుతున్నది. అందుకు సంబంధించిన నిర్మాణాలు చివరి దశకు చేరగా, త్వరలోనే ప్రారంభోత్సవానికి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇది అందుబాటులోకి వస్తే టెక్స్టైల్స్ పార్కులో శిక్షణ పొందిన దాదాపు రెండు వేల మంది మహిళలు, యువకులకు మంచి వేతనంతో ఉపాధి దొరకనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. – రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్న ఉద్దేశ్యంతో ఇండస్ట్రీలకు రుణసౌకర్యం, రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. దాంతో జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. దీనికితోడు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కార్మిక క్షేత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రూ.కోట్ల ఆర్డర్లు, రాయితీలు ఇస్తూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను బలోపేతం చేస్తూనే, మరోవైపు మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ఉద్ధేశ్యంతో గార్మెంట్ రంగాన్ని విస్తరిస్తున్నారు.
ఈ మేరకు సిరిసిల్ల శివారులోని పెద్దూరు గ్రామ సమీపంలో 65 ఎకరాల్లో 174 కోట్లతో ఏర్పాటు చేసిన అప్పారెల్ పార్కుకు గార్మెంట్ పరిశ్రమలు ఒక్కొక్కటిగా తరలివస్తున్నాయి. ఇప్పటికే గోకుల్దాస్ ఇమేజ్ కంపెనీ గ్రీన్ నిడిల్ పేరిట స్థాపించిన యూనిట్లో వెయ్యి మంది మహిళలకు చేతి నిండా పనిదొరుకుతున్నది. ఇక్కడ తయారైన లోదుస్తులను న్యూయర్క్కు ఎగుమతి చేస్తుండగా, నూతనంగా ఏర్పాటవుతున్న టెక్స్పోర్టు కంపెనీలో పిల్లల నుంచి మొదలు పెద్దల దాకా రకరకాల దుస్తులు తయారు చేయనున్నది.
2వేల మందికి ఉపాధి లక్ష్యం
అప్పారెల్ పార్కులో టెక్స్పోర్టు ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఐపీఎల్) తన ఉత్పత్తులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. 2021లో సిరిసిల్లలో యూనిట్ స్థాపించేందుకు ప్రభుత్వంతో ఆ కంపెనీ ఎండీ నరేంద్ర గోయెంకా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థకు సిరిసిల్ల అప్పారెల్ పార్కులో 7.42 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ సంవత్సరమే షెడ్ల నిర్మాణాలు, అడ్మినిస్ట్రేటివ్ భవన నిర్మాణాలు చేపట్టగా, పనులన్నీ తుదిదశకు చేరుకున్నాయి. ఈ నెలలో ఉత్పత్తులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. బెంగుళూర్ కేంద్రంగా కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో యూనిట్లు ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో దుస్తులు తయారీ చేస్తున్నది.
మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్లలో బిల్ట్ టూ సూట్ (బీటీఎస్) యూనిట్ను ఏర్పాటు చేసింది. ప్లగ్ అండ్ ప్లే మోడ్లో వస్ర్తాల తయారీకి కసరత్తు చేస్తున్నది. ఈ కంపెనీలో 2వేల మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం కాగా, మొదటి దశలో 800 మిషన్లతో 1600 మందికి ఉపాధి కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రెండో దశలో వెయ్యి మిషన్లకు విస్తరించి మరో 400 మందికి పని కల్పించనున్నది. చిన్న పిల్లల నుంచి మొదలు పెద్దల దాక అన్ని రకాల దుస్తులు ఈ కంపెనీలో దశలవారీగా తయారు చేస్తారు. అంతర్జాతీయ ఎగుమతులు చేసేలా దుస్తుల తయారీ చేపట్టనున్నది.
మహిళలకు దుస్తుల తయారీలో ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ సెంటర్ను సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్కులో ఏర్పాటు చేసింది. గార్మెంట్ రంగంలో నూతన డిజైన్ల తయారీ, మహిళలు, పురుషుల దుస్తుల తయారీలోనూ మాస్టర్ డిజనైర్లతో నైపుణ్య శిక్షణ ఇస్తున్నది. శిక్షణ పొందే మహిళలకు రోజుకు వంద చెల్లిస్తున్నది. జూకీ కుట్టుమిషన్లపై రోజుకు 30 మంది చొప్పున పదిరోజుల పాటు శిక్షణ పొందిన అనంతరం వీరికి సర్టిఫికెట్లు ఇస్తారు. ఇందులో సుమారు 3వేల వరకు జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి వచ్చి కుట్టులో శిక్షణ పొందుతున్నారు. శిక్షణ కోసం పేరు నమోదు చేసుకున్న రెండునెలల తర్వాత శిక్షణలో చేరే అవకాశం ఉంటుంది. అందులో శిక్షణ పొందిన వారినే అప్పారెల్ పార్కులో తీసుకుని అక్కడ కూడా శిక్షణ ఇస్తారు. అప్పారెల్ పార్కులోని కంపెనీలలో పనిచేసే కార్మికులకు నెలకు 7వేల నుంచి పదివేల వరకు వేతనం ఇస్తారు. గోకుల్దాస్ గ్రీన్ నిడిల్ యూనిట్లో కేవలం మహిళలకు మాత్రమే అవకాశం ఉండగా, నూతనంగా ప్రారంభిస్తున్న టెక్స్పోర్టులో మహిళలు, పురుషులకు కూడ ఉపాధి దొరకనున్నది.