ఇరవై నాలుగేండ్లు రయ్మని ఉరికిన కారుకు సర్వీసింగ్ అవసరం పడదా? తాత్కాలిక బ్రేకర్లు వచ్చాయే తప్ప భూమి ఆకాశం కింద మీదపడ్డట్టు ఆగమాగం కావద్దు. తప్పకుండా మళ్లీ మనమే వస్తం. ప్రజలు మనవద్దకే వస్తరు. రాజకీయాల్లో ఇవి మామూలే. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఎంపీగా వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించేలా ప్రతి కార్యకర్త గట్టిగా పనిచేయాలి.
రాజన్న సిరిసిల్ల, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన జరిగిన సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్ధేశం చేశారు. స్వల్పతేడాతో 14 నియోజకవర్గాలు పోయాయని, అందులో సగం గెలిచినా హంగ్ అసెంబ్లీ వచ్చేదన్నారు. దీనికి ఆగమాగమయ్యే అవసరం ఎంత మాత్రం లేదని, నిరాశ, నిస్పృహల నుంచి బయటకు రావాలని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ చెప్పిన మాటలు నిజమవుతున్నాయని గ్రామాల్లో చాలా మంది రైతులు బాధపడుతున్నారని చెప్పారు.
రేవంత్రెడ్డి సెక్రటేరియట్కు వెళ్లి లంకె బిందెలుంటయనుకుని వచ్చానన్నారని, చూస్తే ఖాళీ బిందెలున్నయన్నారని, లంకె బిందెల కోసం గుట్టలు, గడీలల్లకు రాత్రి దొంగలే పోయి తవ్వుతుంటారని ఎద్దేవా చేశారు. మంత్రిగా పనిచేసిన అనుభవం లేని రేవంత్రెడ్డి సెక్రటేరియట్లో లంకె బిందెలుంటయనుకుంటే పొరపాటని, అక్కడ ఉండేవి కం ప్యూటర్లు, పేపర్లు, పనిచేసేందుకు అధికారులుంటారని చురకలంటించారు. అధికారులను కూర్చోబెట్టి ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలో ఆలోచన చేయాలని హితవుపలికారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయిండని చెప్పి హామీలు ఇవ్వకుం డా తప్పించుకు తిరిగేటోళ్లను కంట కనిపెట్టాలని సూచించారు.
ఈ ఐదేళ్లు పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు. పార్టీని క్షేత్ర స్థాయిలో నిర్మించుకుందామని సూచించారు. పనిచేసే వారికే పదవులిస్తామని స్పష్టం చేశారు. పోయింది అధికారం మాత్రమేనని, పోరాట పటిమతగ్గలేదని, ఎన్నటికీ తగ్గదన్నారు. అధికార ప్రతినిధులను నియమిస్తామని తెలిపారు. కేసీఆర్ తయారు చేసిన సైనికులు వందల మంది ఉన్నారని, ప్రజల పక్షాన రాబోయే ఐదేళ్లు గట్టిగా నిలబడాలని సూచించారు. అధికారం పోయిందన్న బాధతో ప్రజల్ని కించపరిచేలా ఎవరూ మాట్లాడవద్దని కోరారు.
ఈ ఏడాదంతా వరుసగా పార్లమెంటు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలుంటాయని, తన గెలుపు కోసం కష్టపడ్డ పార్టీ శ్రేణుల కోసం తాను కష్టపడుతానని, అన్నిరకాలుగా అండగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటానని ధీమానిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. కోటి 57లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రూ.2500 చొప్పున ఇచ్చి తీరాలని, ఏడాదికి 5 లక్షల మందికి ఇస్తామని ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని నిలదీసి వెంటపడాలన్నారు. నిరుద్యోగ భృతి, బీసీ, మైనార్టీ సబ్ప్లాన్ వంటివి ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా పుస్తకాన్ని పట్టుకుని ప్రజల వద్దకు పోవాలని చెప్పారు.
కేంద్రంలో ఈ పదేండ్ల కాలంలో ఇద్దరు ఎంపీలు పనిచేశారని, అందులో మొదటి ఐదేండ్లు వినోద్కుమార్, తర్వాత బండి సంజయ్ ఉన్నారని, వీరిద్దరిలో ఎవరు ఎంత చేశారో బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. వినోద్కుమార్ పార్లమెంట్లో 110 చర్చల్లో పాల్గొని తెలంగాణ, కరీంనగర్ ప్రజల పక్షాన 550 ప్రశ్నలతో గొంతు విప్పి బలంగా కేంద్రాన్ని నిలదీసిన విషయాన్ని గుర్తు చేశారు. పది ప్రైవేట్ బిల్లులు పెట్టినట్లు తెలిపారు. అదే బండి సంజయ్ ఐదేండ్లలో ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదన్నారు. బండి కేవలం 50 ప్రశ్నలు మాత్రమే అడిగినట్లు చెప్పారు.
ఆయన బిల్లులు పెట్టింది గుండు సున్నా అన్నారు. బండి తన మొఖం చూపెట్టని గ్రామాలెన్నో ఉన్నాయన్నారు. ఏదైనా మంచి పని చేసిండా? అని ప్రశ్నించారు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ఇల్లందకుంటలో రాములవారున్నా నయాపైసా తెచ్చాడా? అని నిలదీశారు. ప్రధాని మోదీ వద్ద గింత పతార ఉన్నా జిల్లాకు ఏం తెచ్చారని ప్రశ్నించాడు. కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఒక్కటి కూడా తేలేదని విమర్శించారు. 2006లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేసీఆర్ నాడు కొత్తపల్లి – మనోహరాబాద్ రైలు మంజూరు చేయించారని గుర్తు చేశారు.
నోద్కుమార్ కృషితో 18 ఏండ్లలో రైలు సిద్దిపేట దాకా వచ్చిందన్నారు. కానీ, ఎంపీ బండి సంజయ్ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, గుడ్ల మంజుల, దరువు ఎల్లన్న, బొల్లి రామ్మోహన్ పాల్గొన్నారు.
“కేటీఆర్కు ఓటేశారని నేతన్నలను కాంగ్రెసోళ్లు బెదిరిస్తే ఊరుకునేది లేదు. నేను నేతన్నలకు మాట ఇస్తున్నా. 39 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధించి, నిర్బంధించి సవాల్ చేస్తాం. ప్రతి నేతన్నను కాపాడుకుంటాం. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆర్డర్లు వచ్చేలా కృషి చేస్తా. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన జాగీర్దార్లం, రాజులం అంటూ పగబట్టి బెదిరిస్తే బెదిరిపోయేది లేదు. చెరువులు నిండినంక కప్పలు మస్తు గొస్తయి. కాంగ్రెసోళ్ల ప్రలోభాలకు, బీజేపోళ్ల భయాలకో బెదిరిపోకండి. భయపడకండి. ఎవ రూ లేని నాడే తెలంగాణ తెచ్చింది గులాబీ జెండా అన్నమాట మరిచి పోవద్దు. పెద్దపెద్ద సిపాయిలను తట్టుకునే రాష్ర్టాన్ని తీసుకొచ్చినం. ఒక్క నాయకుడు పోతే పది మంది కొత్త అద్భుత నాయకులను తయారు చేసుకుందాం. ఆ బాధ్యత నాదే”.
వచ్చే ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. పార్టీ సూచించిన విధంగా మనందరం ముందుకు వెళ్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో రామన్న విజయం కోసం ఎవరికి వారు చాలా కష్టపడి పని చేశారు. వారందరికీ అభినందనలు. వచ్చే ఎన్నికల్లో అలాగే పనిచేయాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి విజయఢంకా మోగించాలి. ప్రస్తుత పరిస్థితి కారుకు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. త్వరలోనే కారు వేగం పెరిగి టాప్గేర్లో దూసుకెళ్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీల కుట్రలు తిప్పికొట్టేలా కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలి. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు